
న్యూఢిల్లీ: దేశీయంగా తగినన్ని నిల్వలు ఉండేలా చూసే ఉద్దేశంతో పారాబాయిల్డ్ రైస్ ఎగుమతులపై 20 శాతం డ్యూటీని ప్రభుత్వం విధించింది. దేశంలో ధరలు పెరగకుండా చూడాలనేది కూడా ఒక లక్ష్యం. ఆగస్టు 25 నుంచి అమలవుతున్న ఈ డ్యూటీ విధింపు అక్టోబర్ 16 దాకా అమలులో ఉంటుందని ఫైనాన్స్ మినిస్ట్రీ వెల్లడించింది. ఆగస్టు 25 కి ముందుగా కస్టమ్స్ పోర్టులలో ఉంచిన పారాబాయిల్డ్ రైస్ కి మాత్రం డ్యూటీ ఎగ్జంప్షన్ ఉంటుందని పేర్కొంది. ఈ చర్యతో అన్ని రకాల నాన్–బాస్మతి రైస్పైనా ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లయింది.
దేశం నుంచి ఎగుమతయ్యే రైస్లో నాన్–బాస్మతి వైట్రైస్కి 25 శాతం వాటా ఉంటోంది. నాన్– బాస్మతి రైస్ ఎగుమతులను కిందటి నెల నుంచి ప్రభుత్వం నిషేధించింది. రాబోయే పండగ సీజన్లో దేశంలో బియ్యం రేట్లు పెరగకుండా చూడాలనే టార్గెట్తోనే ఈ నిషేధం విధించారు. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో ఇండియా నుంచి 15.54 లక్షల టన్నుల నాన్–బాస్మతి వైట్ రైస్ ఎగుమతులు జరిగాయి.