గచ్చిబౌలిలో గజం 2.22 లక్షలు.. చింతల్, గచ్చిబౌలి, నిజాంపేటలో హౌసింగ్ బోర్డు ప్లాట్స్ వేలం

గచ్చిబౌలిలో గజం 2.22 లక్షలు.. చింతల్, గచ్చిబౌలి, నిజాంపేటలో హౌసింగ్ బోర్డు ప్లాట్స్ వేలం
  • మరోసారి రికార్డు ధరకు అమ్ముడుపోయిన హైదరాబాద్లోని ప్లాట్స్​
  • గచ్చిబౌలి, చింతల్, నిజాంపేటలో హౌసింగ్ బోర్డు ప్లాట్స్ వేలం
  • 11 ప్లాట్లు వేలంతో రూ.65 కోట్ల ఆదాయం

హైదరాబాద్, వెలుగు: హౌసింగ్ బోర్డు ప్లాట్స్​మరోసారి రికార్డు స్థాయి ధర పలికాయి. సోమవారం గచ్చిబౌలి, చింతల్, నిజాంపేటల్లో మొత్తం 22 ప్లాట్స్ ను అధికారులు వేలం వేయగా 11 ప్లాట్లు అమ్ముడుపోయాయి. దీని ద్వారా మొత్తం రూ.65 కోట్ల లక్షా 91 వేల 176 ఆదాయం వచ్చినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ వెల్లడించారు. గచ్చిబౌలిలో 1,487 గజాల కమర్షియల్  ప్లాట్​ను గజం రూ.2 లక్షల 22 వేల చొప్పున బిడ్డర్​ కొనుగోలు చేశారు. ఈ ప్లాట్​ ద్వారా బోర్డుకు రూ.33 కోట్ల లక్షా 14 వేల ఆదాయం వచ్చింది. మరో 1,206 గజాల  ప్లాట్ గజం రూ.లక్షా12 వేలకు అమ్ముడుపోగా రూ.13.51 కోట్ల ఆదాయం వచ్చింది. రెండు ఎంఐజీ ప్లాట్లను కూడా సుమారు రూ.4.50 కోట్లకుపైగా వెచ్చించి వేలంలో దక్కించుకునేందుకు కొనుగోలుదారులు పోటీపడ్డారు.

చింతల్ ప్రాంతంలోని ప్లాట్లను కూడా కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. గచ్చిబౌలిలో 3,271 గజాలు, చింతల్ లో 799.98 గజాలు, నిజాంపేటలో 1,653  గజాల విస్తీర్ణంలోని ప్లాట్స్ ను వేలం వేశారు. కుత్బుల్లాపూర్ మండలం చింతల్ లోని హౌజింగ్ బోర్డు ఎంఐజీ ప్లాట్లు కూడా అత్యధిక ధరకు  అమ్ముడుపోయాయి. ఈ ప్రాంతంలో పది ప్లాట్లను వేలం వేయగా, వీటిలో ప్లాట్ నం.113,114,115 ద్వారానే సుమారు రూ. 8.11 కోట్ల మేర ఆదాయం వచ్చింది. నిజాంపేట- బాచుపల్లిలోని నాలుగు ప్లాట్లను సుమారు రూ.70 లక్షలకు వేలంలో కొనుగోలు చేశారు.