రణరంగంగా శంభు సరిహద్దు... పోలీసుల కాల్పుల్లో యువ  రైతు మృతి

రణరంగంగా శంభు సరిహద్దు... పోలీసుల కాల్పుల్లో యువ  రైతు మృతి

ఛలో ఢిల్లీ మార్చ్‌లో భాగంగా పంజాబ్‌- హర్యానా సరిహద్దు శంభు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను విడవగా ఒక రైతు తలకు గాయాలై మరణించాడు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఘర్షణకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

రైతులు చేపట్టిన చలో ఢిల్లీ మార్చ్‌లో భాగంగా బుధవారం ( ఫిబ్రవరి 21) పంజాబ్‌- హర్యానా సరిహద్దు శంభు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఖానౌరీ సరిహద్దులో నిరసనకారులను అడ్డుకునే క్రమంలో హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. దీంతో ఒక రైతు తలకు గాయాలై మరణించాడు. పలువురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

 ఒకవైపు ఘర్షణ వాతావరణం కొనసాగుతుంటే.. మరోవైపు కేంద్రం వారిని చర్చలకు ఆహ్వానించింది. ‘రైతుల డిమాండ్లపై మరోసారి చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. చర్చలకు రైతు సంఘం నాయకులను ఆహ్వానిస్తున్నాం. శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం’ అంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు పెట్టారు.

 ఇప్పటికే రెండు వర్గాల మధ్య నాలుగు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. అయితే ప్రస్తుతం రైతుల వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదని, వారి డిమాండ్లను పరిష్కరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని నాయకులు చెబుతున్నారు. అలాగే రైతుల నిరసనల కారణంగా దేశ రాజధాని సరిహద్దు ప్రాంతాల్లో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. పొక్లెయిన్లు, జేసీబీ ఆపరేటర్లకు వార్నింగ్ ఇచ్చారు. భారీ మెషినరీతో ఆందోళనకారులకు సహకరించవొద్దని, భద్రతా సిబ్బందికి హాని కలిగిస్తే నాన్‌ బెయిలబుల్ కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేశారు.

రైతులుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మద్ధతుగా నిలిచారు. ‘రైతుల డిమాండ్లకు పరిష్కారం లభించాలి. కొన్ని అవసరమైన పంటలకు కనీస మద్దతు ధర విషయంలో చట్టబద్ధత ఉండాలి. కాంగ్రెస్‌ పార్టీ రైతులకు అండగా ఉంటుంది’ అని స్పష్టం చేశారు.