ములుగులో దొంగనోట్ల కలకలం.. కరెంట్​ బిల్లుల వసూళ్లలో వచ్చిన రెండు 500 నోట్లు

ములుగులో దొంగనోట్ల కలకలం.. కరెంట్​ బిల్లుల వసూళ్లలో వచ్చిన రెండు 500 నోట్లు

ములుగు, వెలుగు : ములుగు జిల్లాలో దొంగనోట్లు కలకలం రేపుతున్నాయి. విద్యుత్ అధికారులు కరెంట్​ బిల్లులు  వసూలు చేసే క్రమంలో దొంగనోట్లు వచ్చాయని బ్యాంకు అధికారులు చెప్తున్నారు. ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లో విద్యుత్ అధికారులు బకాయిలు వసూలు చేస్తున్నారు.

సోమవారం వరకు వచ్చిన రూ.7.12 లక్షలను ఎస్బీఐలో డిపాజిట్​ చేసేందుకు వెళ్లగా అందులో రెండు రూ.500 దొంగనోట్లను గుర్తించారు. విద్యుత్ ఆఫీసర్లు మాట్లాడుతూ మేడారం పరిసర ప్రాంతాల్లో బిల్లులు వసూలు చేశామని, అందులో ఎవరి నుంచి వచ్చాయో కనిపెట్టలేకపోతున్నామన్నారు. బ్యాంకు మేనేజర్​ మాట్లాడుతూ ఆర్​బీఐ రూల్స్​ ప్రకారం దొంగనోట్లను చింపి పడేశామని తెలిపారు. ఒకేసారి10 ఫేక్ నోట్లు వస్తేనే కేసు నమోదుకు సిఫారసు చేస్తామని మేనేజర్   చెప్పారు.  కాగా మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ములుగులో దొంగనోట్ల విషయం కలకలం రేపుతోంది.