న్యూఢిల్లీ: ఇక నుంచి ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు రేస్ కోర్సులపై 28 శాతం జీఎస్టీ విధించేలా కేంద్రానికి సిఫారసు చేయాలని మంత్రుల బృందం (జీఓఎం) నిర్ణయించినట్టు తెలిసింది. ప్రతి పందెంపై లేదా గెలిచిన మొత్తంపై జీఎస్టీ విధించడానికి బదులు ప్రారంభ బెట్టింగ్, గేమింగ్ మొత్తంపై పన్ను విధిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒకటి లేదా రెండు రోజుల్లో జీవోఎం కేంద్రానికి రిపోర్టు అందజేస్తుందని వెల్లడించాయి. ఈ ఇండస్ట్రీలో దాదాపు 400 సంస్థలు ఉండగా, వీటిలో దాదాపు 45 వేల మంది పనిచేస్తున్నారు. అంతేగాక జీఎస్టీ అధికారులతో చర్చల కోసం గేమింగ్ ప్లాట్ఫారమ్ల సంఘాన్ని కూడా ఇవి ఏర్పాటు చేసుకున్నాయి. ఈ–-స్పోర్ట్స్, ఫాంటసీ గేమ్లు, రమ్మీ, పోకర్ లేదా చదరంగం.. వీటిలో పాల్గొనడం ఉచితమే కానీ ప్లాట్ఫారమ్ ఫీజులు కట్టాలి. వీటి వ్యాపారాన్ని, సర్వీసుల వాల్యుయేషన్ను అంచనా వేయడానికి 2021లో కేంద్రం రాష్ట్ర మంత్రుల ప్యానెల్ను ఏర్పాటు చేసింది. ఈ విషయమై గేమ్స్24x7 కో–సీఈఓ త్రివిక్రమన్ థంపీ మాట్లాడుతూ పన్నులు పెంచడం వల్ల లాభం ఉండదని, పన్నులను తప్పించుకోవడానికి ఇతర దేశాల నుంచి గేమ్స్ను హోస్ట్ చేస్తారని తెలిపారు. ఆఫ్షోర్ ఆపరేటర్లు ఎక్కువ అవుతారని వివరించారు. చివరికి - పరిశ్రమ నష్టపోతుందని, ప్రభుత్వం పన్ను రాబడిని కోల్పోతుందని చెబుతూ సక్రమంగా వ్యాపారం చేసేవాళ్లకు ఆఫ్షోర్ ఆపరేటర్లతో ఇబ్బందులు వస్తాయని అన్నారు.