
దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. శనివారం (మే31) నాటికి దేశవ్యాప్తంగా కరోనా కేసులు 3వేలు దాటాయి. ప్రస్తుతం దేశంలో 3వేల 207 యాక్టివ్ కేసులున్నాయి. కేరళలో అత్యధికంగా 1147 యాక్టివ్ కేసులండగా..యాక్టివ్ కేసుల పరంగా మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది.
శుక్రవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 84 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో 681 మంది కరోనా రోగులున్నారు. ముఖ్యంగా దేశంలోని యాక్టివ్ కేసులలో ఈ రెండు రాష్ట్రాల్లోనే 60 శాతం కేసులున్నాయి. ప్రాణాంతక వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 29 కి చేరుకుంది. మహారాష్ట్రలో అత్యధికంగా ఆరుగురు మృతిచెందారు. కర్ణాటకలో కూడా కరోనా విజృంభిస్తోంది. శుక్రవారం మైసూర్లో 63 ఏళ్ల వ్యక్తి మృతిచెందాడు. దీంతో కర్ణాటకలో కోవిడ్ మృతుల సంఖ్య మూడుకు చేరింది.
మరోవైపు మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ,మధ్యప్రదేశ్లలో మొత్తం 13 మంది రోగులు మృతిచెందారు. మే 31న ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ ,తమిళనాడులలో ఒక్కొక్కరు మృతిచెందినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.
10 రాష్ట్రాల్లో 20 మంది మృతి
10 రాష్ట్రాల్లో వైరస్ కారణంగా 20 మంది మృతిచెందారు. మహారాష్ట్ర ,కర్ణాటకలో ఎక్కువ మరణాలు సంభవించాయి. మహారాష్ట్ర (6), కర్ణాటక (3), కేరళ (2), యూపీ(2), రాజస్థాన్ (2), ఢిల్లీ (1), గుజరాత్ (1), తమిళనాడు (1), మధ్యప్రదేశ్ (1), పంజాబ్ (1) చొప్పున మృతిచెందారు.
మిజోరాంలో తొలి కేసు నమోదు
మిజోరాంలో 7 నెలల తర్వాత తొలి కోవిడ్-19 కేసు నమోదైందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇద్దరికి వైరస్ పాజిటివ్గా తేలింది. రాష్ట్రంలో చివరిగా వైరస్ కేసు గత ఏడాది అక్టోబర్లో నమోదైంది. ఆ సమయంలో రాష్ట్రంలో 73 మందికి కోవిడ్-19 సోకింది.
భారతదేశంలో కోవిడ్-19 4 కొత్త వేరియంట్స్ ..
వివిధ రాష్ట్రాలలో ఇటీవల కేసుల పెరుగుదల నేపథ్యంలో భారతదేశం నాలుగు కొత్త COVID-19 వేరియంట్లు LF.7, XFG, JN.1, NB.1.8.1లను గుర్తించింది. దక్షిణ ,పశ్చిమ భారతదేశంలోని నమూనాల నుంచి సేకరించిన ఈ వేరియంట్లను గుర్తించారు. అయితే ప్రస్తుత కేసులు తీవ్రంగా లేవని ICMR స్పష్టం చేసింది. ఏవైనా అదనపు వేరియంట్లను గుర్తంచేందుకు పరీక్షలు చేస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అసవరం లేదు.. జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.