ఫర్ ది ఫస్ట్ టైం.. 53 మంది సీబీఐ అధికారులతో విచారణ

 ఫర్ ది ఫస్ట్ టైం.. 53 మంది సీబీఐ అధికారులతో విచారణ

మణిపుర్ హింసాకాండ కేసులపై విచారించేందు దేశవ్యాప్తంగా ఉన్న తమ యూనిట్ల నుంచి 29 మంది మహిళలతో సహా 53 మంది అధికారులను సీబీఐ నియమించింది. అందులో ముగ్గురు డీఐజీలు లవ్లీ కతియార్, నిర్మలా దేవి, మోహిత్ గుప్తా, పోలీసు సూపరింటెండెంట్ రాజ్‌వీర్‌లతో కూడిన బృందం ఉండనుంది. వీరంతా కలిసి మొత్తం దర్యాప్తును పర్యవేక్షించే జాయింట్ డైరెక్టర్ ఘనశ్యామ్ ఉపాధ్యాయ్‌కు నివేదిస్తారని సీబీఐ తెలిపింది. అయితే ఇంత పెద్ద సంఖ్యలో మహిళా అధికారులను ఏకకాలంలో విచారణ జరపనుండటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. సీబీఐ ఇప్పటికే విచారిస్తున్న ఈ కేసుల్లో చాలా వరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం 1989లోని నిబంధనల ప్రకారం లోనివేనని సీబీఐ వర్గాలు తెలిపాయి.

ఈ విచారణలో దర్యాప్తు చేయనున్న మహిళల విషయానికొస్తే ఇద్దరు అదనపు పోలీసు సూపరింటెండెంట్లు, ఆరుగురు డిప్యూటీ సూపరింటెండెంట్లు ఆఫ్ పోలీసులు ఈ మహిళల బృందంలో ఉన్నారు. ఈ సీబీఐ బృందంలో 16 మంది ఇన్‌స్పెక్టర్లు, 10 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు కూడా ఉన్నారు. మణిపుర్ విషయంలో దర్యాప్తులో పక్షపాత ఆరోపణలు రాకుండా స్థానిక అధికారుల పాత్రను తగ్గించామని సీబీఐ అధికారులు తెలిపారు. మణిపుర్ హింసాకాండపై ఇప్పటికే 8 కేసులను సీబీఐ నమోదు చేసింది.

మే 4వతేదీన మహిళల దుస్తులు విప్పి బహిరంగ ప్రదర్శన చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మణిపుర్ హింసాకాండకు సంబంధించి మరో 9 కేసులను దర్యాప్తు చేసేందుకు సీబీఐ సిద్ధమైంది. దీంతో ఆ ఏజెన్సీ విచారించే మొత్తం కేసుల సంఖ్య 17కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. చురచంద్‌పూర్ జిల్లాలో జరిగిన లైంగిక వేధింపుల కేసును దర్యాప్తు సంస్థ స్వీకరించే అవకాశం ఉంది.