మండూస్ ఎఫెక్ట్.. తమిళనాడులో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్

మండూస్ ఎఫెక్ట్.. తమిళనాడులో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్

మండూస్ తుఫాన్ కారణంగా తమిళనాడులోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉత్తర తమిళనాడులో తీరంలోని చెంగల్పట్టు, విల్లుపురం, కాంచీపురం జిల్లాలపై... తుఫాను ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మండూస్ తుఫాన్.. తీవ్ర తుఫాన్‭గా మారి తీరం వైపు దూసుకొస్తోంది. ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. తుపాన్ తీరాన్ని తాకే సమయంలో తమిళనాడు ఉత్తర తీరంతోపాటు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో పుదుచ్చేరి, శ్రీహరికోటకు మధ్య, మహాబలిపురం చుట్టుపక్కల 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 

మండూస్‌ తుఫాను నేపథ్యంలో.. గ్రేటర్ చెన్నై కార్పోరేషన్ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నగరంలోని పార్కులను, ప్లే గ్రౌండ్‌లను మూసివేయించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు పార్కులను, ప్లే గ్రౌండ్‌లను తెరువవద్దని ఆదేశించారు. మండూస్‌ తుఫాను నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై గ్రేటర్ చెన్నై కార్పోరేషన్ కమిషనర్‌ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. తుఫాన్ కారణంగా ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.