బీఆర్ఎస్ అకౌంట్ నుంచి 30 కోట్లు ట్రాన్స్​ఫర్ : రఘునందన్

బీఆర్ఎస్ అకౌంట్ నుంచి 30 కోట్లు ట్రాన్స్​ఫర్ : రఘునందన్
  • ఎమ్మెల్సీ బై పోల్​లో ఓట్లు కొనేందుకు కుట్ర చేస్తున్నది
  • సీఈసీకి లేఖ రాసిన రఘునందన్
  • 34 మంది ఎలక్షన్ ఇన్​ఛార్జ్​లకు డబ్బులు బదిలీ

హైదరాబాద్/తూప్రాన్​,వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో రూ.30 కోట్లతో ఓట్లు కొనేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. ఈ మేరకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్​తో పాటు సీఈవో వికాస్ రాజ్​కు ఆయన ఆదివారం లేఖ రాశారు. కెనరా బ్యాంక్​లోని బీఆర్ఎస్ ఆఫీషియల్ అకౌంట్ నుంచి 34 మంది ఎన్నికల ఇన్​చార్జ్​లకు భారీగా డబ్బులు ట్రాన్స్​ఫర్ అయ్యాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.

 ఈ ట్రాన్సాక్షన్​పై ఎన్నికల కమిషన్ వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే కోట్లాది రూపాయలను ఓట్లు కొనేందుకు ఉపయోగిస్తారని తెలిపారు. బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నదని విమర్శించారు. బ్యాంకు అకౌంట్ పూర్తి వివరాలతో పాటు ట్రాన్సాక్షన్ స్టేట్​మెంట్​ను కూడా జత చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.

 బీఆర్ఎస్ పార్టీకి చెందిన అధికారిక అకౌంట్​తో పాటు డబ్బులు బదిలీ అయిన ఖాతాలను వెంటనే ఫ్రీజ్ చేయాలని కోరారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నదని తెలిపారు.