పోచంపల్లిలో ఆఫ్రికా ప్రతినిధుల సందడి .. భారత సంస్కృతి, టూరిజంపై ప్రమోట్ చేసేందుకు విజిట్

పోచంపల్లిలో ఆఫ్రికా ప్రతినిధుల సందడి .. భారత సంస్కృతి, టూరిజంపై ప్రమోట్ చేసేందుకు విజిట్
  • చేనేత కళాకారుల ప్రతిభ అద్భుతమని ప్రశంస

భూదాన్ పోచంపల్లి, వెలుగు : చేనేత కళాకారుల కళ అద్భుతమని విదేశీ  ప్రతినిధులు కొనియాడారు. బుధవారం యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఆఫ్రికాలోని పలు దేశాలకు చెందిన 30 మంది సందర్శించారు. టూరిజం పార్కులో  చేనేత మ్యూజియంను చూసి ముగ్ధులయ్యారు.  అనంతరం కళా పునర్నవి హ్యాండ్లూమ్ లో  చేనేత కార్మికులతో మాట్లాడుతూ పనితీరు, వస్త్రాల తయారీని తెలుసుకున్నారు. చేనేతలో భాగంగా చిటికీ వేయడం, మగ్గం నేయడం వంటివి  స్వతహాగా కూర్చొని విని నేర్చుకున్నారు. 

అనంతరం భూదాన్ పోచంపల్లిలోని చేనేత కాలనీలను సందర్శిస్తూ పిల్లలు,  మహిళలతో ముచ్చటిస్తూ డ్యాన్సులు చేస్తూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు.  చేనేత జౌళి శాఖ ఏడీ దశరథ మాట్లాడుతూ  భారత సంస్కృతి, సంప్రదాయాలను, పర్యాటక ప్రాంతాలను ఆఫ్రికా ఖండంలోని ప్రజలకు తెలియజేసేవిధంగా విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో 30 మంది ప్రతినిధులు (కంటెంట్ రైటర్స్) తెలంగాణలో ఐదు రోజులపాటు పర్యటిస్తున్నారని తెలిపారు.  

ఆకట్టుకున్న భారత సంతతి యువతి 

ఆఫ్రికా ప్రతినిధుల్లో చీర కట్టులో భారతీయ సంస్కృతి కొట్టొచ్చేలా ఓ యువతి కనిపించారు. ఆమె పేరు యోవానీ నాయుడు.  కంటెంట్ క్రియేటర్ గా దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహిస్తూ భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చారు. ఆమె తండ్రి తెలుగు వ్యక్తి కాగా, తల్లిది తమిళనాడు. పూర్వీకులు శతాబ్దాల కింద దక్షిణాఫ్రికా వలస వెళ్లగా.. ఆమె ఆరో తరానికి చెందినవారు.  భౌతికంగా భారత్ కు దూరమైనా మానసికంగా ఎప్పటికీ దగ్గరగానే ఉన్నామని ఆమె పేర్కొంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఐదేండ్లనుంచే సంగీతంపై ఆసక్తి కలిగిందని వ్యక్తం చేశారు. శ్రేయా ఘోషల్, చిత్ర, అనిరుధ్, రెహమాన్ అంటే ఇష్టమన్నారు. తెలుగు పాటలు చక్కగా పాడే యోవానీ నాయుడు .. టాలీవుడ్, కోలీవుడ్ కు గ్రేట్ ఫ్యాన్ అంటూ దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని అన్నారు.