హుస్నాబాద్ ట్రైబల్ వెల్ఫేర్​ రెసిడెన్షియల్ స్కూల్​​లో 30 క్వింటాళ్ల బియ్యం మాయం

హుస్నాబాద్ ట్రైబల్ వెల్ఫేర్​ రెసిడెన్షియల్ స్కూల్​​లో 30 క్వింటాళ్ల బియ్యం మాయం
  • నూనె, పప్పుదినుసులు, పసుపు, కారంపొడి సహా ఇతర వస్తువుల అపహరణ
  • ఇన్​చార్జి ప్రిన్సిపాల్, పీఈటీ, అటెండర్లే సూత్రదారులు
  • పోలీస్ స్టేషన్​చేరిన వ్యవహారం

హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​మండలం జిల్లెలగడ్డలోని ట్రైబల్​వెల్ఫేర్​రెసిడెన్షియల్​స్కూల్, జూనియర్​కాలేజీలో 30 క్వింటాళ్ల బియ్యం మాయమయ్యాయి. వీటితోపాటు వంటనూనె, పప్పుదినుసులు, పసుపు, కారంపొడిని కూడా అపహరించారు. ఇన్​చార్జి ప్రిన్సిపాల్​మధు, పీఈటీ చందూలాల్, అటెండర్​రమేశ్, వర్కర్లు వల్లకట్ట అరుణ, యాద రేణుక సహకారంతోనే ఇదంతా జరిగిందని పోలీసుల విచారణలో తేలింది. పరీక్షలు కంప్లీట్​కావడంతో స్కూల్ స్టూడెంట్స్​కు సెలవులు వచ్చాయి. 

కాలేజీ స్టూడెంట్స్​కు పలు కోర్సుల్లో సమ్మర్​ కోచింగ్​ఇస్తున్నారు. తక్కువ మంది స్టూడెంట్స్​ఉండడంతో వారంతా హాస్టల్​రూముల్లో ఉంటున్నారు. దీంతో స్టోర్​ రూంలో బియ్యాన్ని ఎలుకలు కొడుతున్నాయని వరండాలోకి తెచ్చారు. ఎవరైనా అడిగితే లోపల ఎలుకలు ఉన్నాయని చెబుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా రోజుకు పది క్వింటాళ్ల చొప్పున బియ్యాన్ని, పప్పుదినుసులు, నూనెడబ్బాలు, పసుపు, కారంపొడిని ఎత్తుకెళ్లారు. 

ఇన్​చార్జి ప్రిన్సిపాల్​ సహకారంతోనే ఇదంతా జరిగినట్టు చెబుతున్నారు. ఈ విషయమై ఆయనను వివరణ కోరగా వర్కర్లే బియ్యాన్ని తీసుకెళ్లారన్నారు. అయితే తనకు ఎలుకలు కొట్టిన బియ్యాన్ని తీసుకెళ్లినట్టు తెలిసిందని, స్టోర్​ రూంలో బియ్యం మాయమైనట్టు ఇప్పుడే తెలిసిందన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని సీఐ శ్రీనివాస్​తెలిపారు. వారి ఆదేశాలను బట్టి నిందితులపై చర్యలుంటాయన్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు మల్లేశ్​ డిమాండ్​ చేశారు.