జంషెద్పూర్: అన్ని రకాల వాహనాలకు డిమాండ్ పడిపోవడంతో ఝార్ఖండ్లోని స్టీలు కంపెనీలు అష్టకష్టాలు పడుతున్నాయి. అమ్మకాలు సన్నగిల్లడం వల్ల రాజధాని జంషెద్పూర్లోని టాటా మోటార్స్ బ్లాక్ తరచూ మూతబడుతోంది. గత నెల నుంచి ఇప్పటి వరకు ఈ బ్లాక్ను నాలుగుసార్లు మూసేశారు. టాటా మోటార్స్ సహా ఇతర ఆటో కంపెనీలకు స్టీలు సరఫరా చేసే కంపెనీలకు తీవ్ర నష్టాలు వస్తున్నాయి. కరెంటు చార్జీలు కూడా విపరీతంగా పెరగడంతో వీటి పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది.
జంషెద్పూర్తోపాటు చుట్టుపక్కన ప్రాంతాల్లో కంపెనీలు.. ముఖ్యంగా ఆదిత్యపూర్ ఇండస్ట్రియల్ ఏరియా (ఏఐఏ)లో ఇప్పటికే డజను స్టీలు కంపెనీలు మూతబడ్డాయి. మరో 30 కంపెనీలు మూసివేతదిశగా పయనిస్తున్నాయి. టాటా మోటార్స్ బ్లాక్ ప్రతి వారం గురువారం నుంచి ఆదివారం వరకు పనిచేయడం లేదు. కార్మికుల సంఖ్యను కుదించారు. డ్యూటీలనూ తగ్గించారు. గత రెండు నెలల్లో కేవలం 15 రోజుల్లో మాత్రమే ఉత్పత్తి జరిగిందంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఈ నెల వచ్చిన ఆర్డర్ల కోసం కేవలం వారం రోజులకు మించి పని ఉండదని యూనియన్లు చెబుతున్నాయి. టాటా మోటార్స్ ఆర్డర్లు బాగా తగ్గిపోవడంతో రోజులో చాలా సమయం ఖాళీగా కూర్చుంటున్నామని ఆదిత్యపూర్ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇందర్ అగర్వాల్ అన్నారు.