- కోటి కుటుంబాలకు 300 యూనిట్ల కరెంట్ ఫ్రీ
- రూఫ్ టాప్ సోలార్ స్కీంకు రూ.10 వేల కోట్లు
- ప్రధానమంత్రి సూర్యోదయ యోజనతో
- ఏడాదికి రూ.18 వేలు ఆదా: నిర్మల
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన కింద రూఫ్ టాప్ సోలార్ స్కీంకు మధ్యంతర బడ్జెట్ లో రూ.10 వేల కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద రూఫ్ టాప్ సోలారైజేషన్ (ఇంటి మిద్దెపై సోలార్ రూఫ్ టాప్ లు అమర్చడం) తో ప్రతి నెలా కోటి కుటుంబాలకు 300 యూనిట్ల కరెంట్ ఫ్రీగా సప్లై చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతో ఏడాదికి ఆ కుటుంబాలకు రూ.15 వేల నుంచి రూ.18 వేల చొప్పున ఆదా అవుతుందని, అంతేకాకుండా మిగులు విద్యుత్తును డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు అమ్ముకోవచ్చని నిర్మల తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు సూర్యోదయ యోజన పథకంతో ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు.
రూఫ్ టాప్ ల తయారీ, ఇన్ స్టలేషన్, మెయింటెనెన్స్ వంటి వాటితో నైపుణ్యం గల యువత ఉపాధి అవకాశాలు పొందవచ్చని ఆమె పేర్కొన్నారు. 2070 లోపు కర్బన ఉద్గారాలను సున్నాకు తగ్గించాలన్న విషయంలో కట్టుబడి ఉన్నామని, అందుకోసం సోలార్, విండ్ ఎనర్జీ వంటి ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ డేటా ప్రకారం 73 గిగావాట్లపైనే సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేసే సామర్థ్యం దేశానికి ఉందన్నారు. ‘‘విండ్ ఎనర్జీతో 45 గిగావాట్లు, హైడ్రో ఎనర్జీతో 25 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేశాం. అలాగే బయోమాస్ తో 10 గిగావాట్లు, స్మాల్ హైడ్రోతో 25 మెగావాట్లు, వేస్ట్ టు వేస్టు ఎనర్జీతో 583 మెగావాట్ల కరెంట్ జనరేట్ చేశాం. 2030 లోపు 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం” అని నిర్మల పేర్కొన్నారు.