హైదరాబాద్, వెలుగు : మిషన్ భగీరథకు 2019 మార్చి నెలాఖరు వరకు రూ.32,652.10 కోట్ల అప్పు తీసుకున్నామని రాష్ట్ర సర్కారు వెల్లడించింది. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ యాన్యువల్ ఎకౌంట్స్ రిపోర్టులను శనివారం అసెంబ్లీ, కౌన్సిల్లలో విడుదల చేశారు. 2016–17 నుంచి 2018-–19 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలం లో మిషన్ భగీరథ స్కీం కోసం ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలను ఆ నివేదికల్లో ప్రస్తావించారు. మిషన్ భగీరథ పథకం కోసం ఖర్చు చేసిన మొత్తంలో 10శాతమే ప్రభుత్వం భరించగా.. మిగతా 90 శాతం నిధులను హడ్కో, నాబార్డ్, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి సమీకరించింది.
మిషన్ భగీరథ (వాటర్ గ్రిడ్) స్కీం అమలుకు రుణ సమీకరణకు ప్రభుత్వం 2015లో తెలంగాణ డ్రింకింగ్ వాటర్సప్లయ్ కార్పొరేషన్ పేరుతో స్పెషల్ పర్సస్ వెహికిల్ (ఎస్పీవీ)ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ గ్యారంటీతో స్కీం అమలులో భాగంగా సివిల్ వర్క్లు చేయడానికి లోన్లు తెచ్చుకుంది. అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మంజూరు చేసిన లోన్ల రీపేమెంట్ ఇప్పటికే ప్రారంభమైందని సర్కారు స్పష్టం చేసింది. కరోనా తో నివేదికలు సభలో ప్రవేశపెట్టడం ఆలస్యమైందని తెలిపింది. ఈ లోన్లను 12 ఏండ్ల పాటు 48 వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉందని పేర్కొంది. కరోనా తో నాబార్డు నుంచి 2 విడతల్లో తీసుకున్న లోన్ల చెల్లింపునకు మూడేండ్లు, మరో 2 విడతల లోన్ల రీపేమెంట్కు రెండేళ్లు మారటోరియం తీసుకున్నారు.