టోక్యోలో ఘనంగా ప్రారంభమైన 32వ ఒలింపిక్స్ క్రీడలు

టోక్యోలో ఘనంగా ప్రారంభమైన 32వ ఒలింపిక్స్ క్రీడలు

జపాన్ రాజధాని టోక్యోలో 32వ ఒలింపిక్స్ క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జపాన్ చక్రవర్తి నరుహిటో, అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్ లాంఛనంగా ఈ క్రీడోత్సవాన్ని ప్రారంభించారు. లేజర్ తళుకులు, బాణసంచా మెరుపులు, మిరుమిట్లు గొలిపే విద్యుద్దీప కాంతులు, కళాకారుల విన్యాసాల నడుమ  క్రీడలు షురూ అయ్యాయి.  మొదట గ్రీస్ అథ్లెట్లు తమ జాతీయ పతాకంతో మార్చ్ చేశారు. ఆ తర్వాత శరణార్థుల జట్టు మార్చ్ పాస్ట్ లో పాల్గొంది. జపాన్ భాష అక్షర క్రమం ప్రకారం ఆయా దేశాలు మార్చ్ పాస్ట్ లో వరుసగా రానున్నాయి.

ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా బంగ్లాదేశ్ కు చెందిన నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్ కు ఒలింపిక్స్ లారెల్ అవార్డు ప్రదానం చేశారు. ఒలింపిక్స్ క్రీడలు ఇవాళ్టి(శుక్రవారం) నుంచి ఆగస్టు 8 వరకు అలరించనున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా స్టేడియాలకు ప్రేక్షకులను అనుమతించడంలేదు.

మార్చ్ పాస్ట్ లో భారత బృందానికి బాక్సర్ మేరీకోమ్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ నేతృత్వం వహించారు. భారత టీంలో 20 మంది అథ్లెట్లు, ఆరుగురు ప్రతినిధులు పాల్గొన్నారు. మేరీకోమ్, మన్ ప్రీత్ జాతీయ పతాకంతో ముందు నడస్తుండగా.. భారత అథ్లెట్లు వారిని అనుసరించారు.