షాద్ నగర్ లో బొలెరో, ఆర్టీసీ బస్సు ఢీ... 36 మేకలు మృతి..

షాద్ నగర్ లో  బొలెరో, ఆర్టీసీ బస్సు ఢీ... 36 మేకలు మృతి..

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఘోర ప్రమాదం జరిగింది.. షాద్ నగర్ బైపాస్ రోడ్ లో మేకల లోడ్ తో బొలెరో వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో 36 మేకలు మృతి చెందాయి. ఆదివారం ( జూన్ 15 ) ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. షాద్ నగర్ బైపాస్ రోడ్ లో మేకల లోడ్ తో వెళ్తున్న బొలెరో వాహనాన్ని హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

ఈ ఘటనలో 36 మేకలు మరణించగా.. బొలెరో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.  బస్సులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అదుపు తప్పిన బస్సు బోలెరోను ఢీకొని రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ ను పరిశీలించి కేసు నమోదు చేశారు. ఒకేసారి 36 మేకలు మృతి చెందడంతో వాటి యజమాని తీవ్ర విషాధంలో కూరుకుపోయాడు.

కాగా.. శనివారం ( జూన్ 14 ) జరిగిన ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు తిమ్మాపురం దగ్గర మామిడి పళ్ళ లారీ బోల్తా పడటంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. షాద్ నగర్ వైపు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలయ్యాయి. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కువగా హైదరాబాద్ కి చేరుకునే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.