పోదాం పద సర్కార్ బడికి .. కామారెడ్డి జిల్లాలో వారంలోనే 10,222 మంది చేరిక

పోదాం పద  సర్కార్ బడికి .. కామారెడ్డి జిల్లాలో వారంలోనే 10,222 మంది చేరిక
  • సర్కార్​ బడుల వైపు విద్యార్థుల అడుగులు
  • ప్రైవేట్ స్కూల్స్ నుంచి 3,763 మంది రాక 
  • కామారెడ్డి జిల్లాలో ఊపందుకున్న చేరికలు

కామారెడ్డి, వెలుగు : ప్రైవేటు స్కూళ్లను వదిలి విద్యార్థులు సర్కార్​ బడి వైపు అడుగులు వేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమైన వారం రోజుల్లో కామారెడ్డి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో 10‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,222 మంది విద్యార్థులు చేరారు.   ప్రైవేట్​ స్కూల్స్ నుంచి 3,763 మంది విద్యార్థులు సర్కార్​ బడుల్లో చేరారు. వేసవి సెలవుల తర్వాత స్కూళ్ల రీ ఓపెన్​కు ముందే బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. సర్కారు బడుల్లో సౌకర్యాలు,  మెరుగైన విద్యా బోధన, క్వాలిఫైడ్ టీచర్లు,   మధ్యాహ్న భోజనం,  ఎస్సెస్సీ ఫలితాలపై ఇంటింటికి తిరుగుతూ టీచర్లు ప్రచారం చేశారు. 

 ప్రైవేట్ స్కూల్స్​లో  చదువుతున్న విద్యార్థులు, తల్లిదంద్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి సర్కారు బడుల్లో చేరేలా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ప్రైమరీ స్థాయిలో కొన్ని గ్రామాల్లో  స్థానికుల డిమాండ్​కు అనుగుణంగా  గవర్నమెంట్ స్కూల్స్​లో ఇంగ్లిష్ బోధిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. జడ్పీ, రెసిడెన్షియల్,  మాడల్ స్కూల్స్​,  కేజీబీవీలు మొత్తం 1,081 ఉన్నాయి.   ఇందులో జడ్పీ పరిధిలో 990  స్కూల్స్ ఉన్నాయి.  వీటిలో  83,703 మంది విద్యార్థులు చదువుతున్నారు. 

ఈసారి ప్రవేశాలు ఇలా.. 

ఈ అకాడమిక్ ఇయర్​లో వారం రోజుల్లోనే ప్రభుత్వ బడుల్లో 10,222 మంది విద్యార్థులు  చేరారు. ఒకటో తరగతిలో 3,370 మంది,  రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు  6,852 మంది స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్నారు. ప్రైవేట్ స్కూల్స్​ నుంచి ప్రభుత్వ బడుల్లో చేరిన వారు  3,763 మంది ఉండగా, గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్​లో చేరిన వారు 3,088 మంది ఉన్నారు.   ప్రైమరీ స్కూల్​లో చదివి వారు యూపీఎస్​, హైస్కూల్​లో చేరారు. 

అంగన్​వాడీ కేంద్రాల్లో చదివి ఒకటో క్లాస్​లో చేరడానికి 6 వేల మంది విద్యార్థులను అధికారులు గుర్తించగా, 3,370 మంది ఒకటో తరగతిలో చేరారు.  ప్రైమరీతో పాటు, హైస్కూల్​లో ప్రైవేట్​గా చదివిన వారు హైస్కూల్​కు వచ్చే సరికి కొందరు ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు, ప్రభుత్వం చేపట్టిన బడి బాటలో టీచర్ల ప్రచారంతో గవర్నమెంట్ స్కూల్స్​ వైపు వచ్చారు. అడ్మిషన్లకు సమయం ఉన్న దృష్ట్యా విద్యార్థుల సంఖ్య పెరిగే వీలుంది.