
- సర్కార్ బడుల వైపు విద్యార్థుల అడుగులు
- ప్రైవేట్ స్కూల్స్ నుంచి 3,763 మంది రాక
- కామారెడ్డి జిల్లాలో ఊపందుకున్న చేరికలు
కామారెడ్డి, వెలుగు : ప్రైవేటు స్కూళ్లను వదిలి విద్యార్థులు సర్కార్ బడి వైపు అడుగులు వేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమైన వారం రోజుల్లో కామారెడ్డి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో 10,222 మంది విద్యార్థులు చేరారు. ప్రైవేట్ స్కూల్స్ నుంచి 3,763 మంది విద్యార్థులు సర్కార్ బడుల్లో చేరారు. వేసవి సెలవుల తర్వాత స్కూళ్ల రీ ఓపెన్కు ముందే బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. సర్కారు బడుల్లో సౌకర్యాలు, మెరుగైన విద్యా బోధన, క్వాలిఫైడ్ టీచర్లు, మధ్యాహ్న భోజనం, ఎస్సెస్సీ ఫలితాలపై ఇంటింటికి తిరుగుతూ టీచర్లు ప్రచారం చేశారు.
ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులు, తల్లిదంద్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి సర్కారు బడుల్లో చేరేలా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ప్రైమరీ స్థాయిలో కొన్ని గ్రామాల్లో స్థానికుల డిమాండ్కు అనుగుణంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లిష్ బోధిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. జడ్పీ, రెసిడెన్షియల్, మాడల్ స్కూల్స్, కేజీబీవీలు మొత్తం 1,081 ఉన్నాయి. ఇందులో జడ్పీ పరిధిలో 990 స్కూల్స్ ఉన్నాయి. వీటిలో 83,703 మంది విద్యార్థులు చదువుతున్నారు.
ఈసారి ప్రవేశాలు ఇలా..
ఈ అకాడమిక్ ఇయర్లో వారం రోజుల్లోనే ప్రభుత్వ బడుల్లో 10,222 మంది విద్యార్థులు చేరారు. ఒకటో తరగతిలో 3,370 మంది, రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు 6,852 మంది స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్నారు. ప్రైవేట్ స్కూల్స్ నుంచి ప్రభుత్వ బడుల్లో చేరిన వారు 3,763 మంది ఉండగా, గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో చేరిన వారు 3,088 మంది ఉన్నారు. ప్రైమరీ స్కూల్లో చదివి వారు యూపీఎస్, హైస్కూల్లో చేరారు.
అంగన్వాడీ కేంద్రాల్లో చదివి ఒకటో క్లాస్లో చేరడానికి 6 వేల మంది విద్యార్థులను అధికారులు గుర్తించగా, 3,370 మంది ఒకటో తరగతిలో చేరారు. ప్రైమరీతో పాటు, హైస్కూల్లో ప్రైవేట్గా చదివిన వారు హైస్కూల్కు వచ్చే సరికి కొందరు ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు, ప్రభుత్వం చేపట్టిన బడి బాటలో టీచర్ల ప్రచారంతో గవర్నమెంట్ స్కూల్స్ వైపు వచ్చారు. అడ్మిషన్లకు సమయం ఉన్న దృష్ట్యా విద్యార్థుల సంఖ్య పెరిగే వీలుంది.