- త్వరలోనే అభ్యర్థుల లిస్ట్,
- మేనిఫెస్టో ప్రకటిస్తం : పిట్టా రాంరెడ్డి
హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ నుంచి పోటీ చేసేందుకు అన్ని నియోజకవర్గాల నుంచి 379 అప్లికేషన్లు వచ్చాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి వెల్లడించారు. త్వరలో పార్టీ చీఫ్ షర్మిల అభ్యర్థుల లిస్ట్, మేనిఫెస్టో విడుదల చేస్తారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా మేనిఫెస్టో తయారు చేస్తున్నామన్నారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్బీ నగర్ కు 10 అప్లికేషన్లు, జనగామకు 8 అప్లికేషన్లు వచ్చాయని, మిగతా ప్రధాన పార్టీల్లో టికెట్ ఆశించి రాని వాళ్లు కూడా సుమారు 50 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. స్వీకరణ గడువును మరో 2 రోజులు పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో షర్మిల పర్యటిస్తారని తెలిపారు. ప్రవళిక ఆత్మహత్యపై కేటీఆర్ సోయి లేకుండా మాట్లాడుతున్నారని, 45 రోజుల్లో ఈ సర్కారు పోతదని, కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు.
ఆకుల లలితతో పార్టీ నేతల భేటీ
ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను వైఎస్సార్టీపీ నేత నీలం రమేశ్ హైదరాబాద్ లో కలిశారు. పార్టీలో చేరాలని ఆమెను ఆహ్వానించారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పినట్లు నీలం రమేశ్ తెలిపారు. ఈ భేటీలో వైఎస్సార్తో తన అనుబంధాన్ని ఆకుల లలిత గుర్తు చేసుకున్నారని ఆయన చెప్పారు.