- తొలి విడతలో ఉమ్మడి జిల్లాలో 380 సర్పంచ్ ఎన్నికలు
- నేటితో ముగియనున్న తొలివిడత ప్రచారం
- ఇప్పటికే ఏకగ్రీవమైన స్థానాలు 26
- సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్
పెద్దపల్లి, వెలుగు: ఉమ్మడి కరీంనగర్జిల్లాలో తొలి విడత ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 11న ఈ ఎన్నికలు జరగనుండగా అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. నేటితో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఆయా పార్టీలు బలపరిచే అభ్యర్థుల కోసం పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1224 గ్రామ పంచాయతీలుండగా, వీటి పరిధిలో11,195 వార్డు స్థానాలున్నాయి.
మొదటి విడతలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 380 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటిలో కరీంనగర్ 89, పెద్దపల్లి 95, జగిత్యాల 118, రాజన్న సిరిసిల్ల 78 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ 380 సర్పంచ్ స్థానాలకు గానూ 1,526 మంది పోటీలో ఉన్నారు. ఇప్పటికే 26 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మొదటి విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సిబ్బందికి ట్రైనింగ్, విధుల కేటాయింపు, పోలింగ్ సామగ్రి తదితర ఏర్పాట్లు పూర్తిచేశారు.
సెన్సిటివ్ సెంటర్లలో వెబ్ కాస్టింగ్
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అధికారులు సమస్యాత్మక పోలింగ్ సెంటర్లను గుర్తించారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా వెబ్ కాస్టింగ్ కోసం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ను ఎన్నికల విధుల్లో నియమించనున్నట్లు తెలిసింది. గ్రామాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉండకపోవడం మూలంగా వెబ్ కాస్టింగ్కు అంతరాయం జరిగే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో అలాంటి పరిస్థితులు చోటుచేసుకున్నా నేపథ్యంలో ప్రస్తుత
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వెబ్కాస్టింగ్కు అంతరాయం జరుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. అలాగే అభ్యర్థులు, వారి అనుచరులు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలకు పూనుకోకుండా పోలీసుశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో రానున్న ఎన్నికల దృష్ట్యా ఎక్కడైతే ర్యాంపులు, విద్యుత్, పోలింగ్ సిబ్బంది స్టే చేయడానికి సరైన ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
