మూసీ ప్రక్షాళనకు ముందడుగు..

మూసీ ప్రక్షాళనకు ముందడుగు..
  • పరిపాలనా అనుమతులు జారీ చేసిన ప్రభుత్వం
  • ఓఆర్ఆర్​ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఏర్పాటు 

హైదరాబాద్, వెలుగు: మూసీ నది ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఔటర్​రింగ్ రోడ్​పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో కొత్తగా 39 ఎస్టీపీ(సీవేజ్​ట్రీట్​మెంట్​ప్లాంట్)లు నిర్మించాలని నిర్ణయించింది. అందుకోసం శనివారం రూ.3,849.10 కోట్లు మంజూరు చేసింది. పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే గ్రేటర్​పరిధిలో వాటర్​బోర్డు రూ.3,866.41కోట్లతో 39 ఎస్టీపీలను నిర్మిస్తోంది. వీటి నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. త్వరలోనే ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిని ఓఆర్ఆర్ వరకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్​చేస్తుంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో కొత్తగా మరో 39 ఎస్టీపీలను నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకు అమృత్ 2.0 పథకం కింద నిధులు మంజూరయ్యాయి. ఒక ఎస్టీపీని ప్రైవేట్ పబ్లిక్​ భాగస్వామ్యం(పీపీపీ) పద్దతిలో నిర్మించనుండగా, 38 ఎస్టీపీలను హైబ్రిడ్​హామిట్ మోడ్(హెచ్ఏఎం)లో నిర్మించనున్నట్టు అధికారులు తెలిపారు. 

రెండు ప్యాకేజీలుగా విభజన

ఈ ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ–1లో 16, ప్యాకేజ్​–2లో 22 ఎస్టీపీలను నిర్మిస్తారు. నిర్మాణం పూర్తయితే రోజుకు 972 ఎంల్​డీల మురుగు నీటిని శుద్ధి చేసే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. స్ధానిక సంస్థల పరిధిలో ఎస్టీపీల నిర్మాణం ద్వారా మూసీ నదిలోకి వచ్చే మురుగునీటిని అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజూ 1,950 ఎంఎల్​డీల మురుగు నీరు ఉత్పత్తి అవుతోంది. జీహెచ్ఎంసీ ప్రాంతంలోనే 1,650 ఎంఎల్​డీలు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్​డీల మురుగు నీటిని శుద్ధి చేస్తున్నారు.