- జనం భారీగా తరలివచ్చినా.. కొనుగోళ్లు తక్కువే
ముషీరాబాద్, వెలుగు: ఎన్టీఆర్ స్టేడియంలో 11 రోజులపాటు కొనసాగిన 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ సోమవారం రాత్రి ముగిసింది. పలు భాషల పుస్తకాలు అందుబాటులో ఉంచగా, అనేకమంది సందర్శకులు తరలివచ్చారు. రచయితలు, కవుల సమావేశాలు, పుస్తకావిష్కరణలు, పిల్లల కార్యక్రమాలు కొనసాగాయి. ముగింపు రోజున జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ కే రామచంద్రమూర్తి, గంట చక్రపాణి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ హాజరై పలు స్టాల్స్ సందర్శించి పుస్తకాలు కొనుగోలు చేశారు.
రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ వెలుగు దినపత్రిక స్టాల్ను సందర్శించారు. బుక్ ఫెయిర్కు నగర ప్రజలు భారీగా తరలివచ్చినా పుస్తకాలు కొనుగోలు తక్కువే జరిగాయని స్టాల్స్ నిర్వాహకులు వాపోయారు. 368 స్టాళ్లకు సందర్శకులు రావడం, అడగడం, చూడడం.. ఒకటి రెండు బుక్కులకే పరిమితమయ్యారని, ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదన్నారు.
