- ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి పంపే యోచన
- ఇప్పటికే కొత్త చట్టంపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు
- కొట్ట చట్టం ప్రకారం 60:40 నిష్పత్తిలో నిధులు.. రాష్ట్రంపై 1,500 కోట్ల భారం
హైదరాబాద్, వెలుగు: కేంద్రం ప్రభుత్వం ఇటీవల ఉపాధి హామీ స్కీమ్లో మార్పులు చేస్తూ తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్’ (వీబీ- జీరామ్ -జీ)కి వ్యతిరేకంగా జంగ్సైరన్ మోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే నెల 2న అసెంబ్లీలో చర్చ పెట్టేందుకు నిర్ణయించింది. అలాగే, కేంద్రం తీరును ఎండగట్టేందుకు రెడీ అయింది.
వీబీ జీ రామ్ జీ చట్టంతో ఉపాధి స్కీమ్లో నిధుల కోతలు విధించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు భారం పడనున్నదని, కూలీల ఉపాధికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంటున్నది. ఈ నేపథ్యంలో దీనివల్ల రాష్ట్రానికి జరిగే నష్టంపై చర్చించి ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ప్రభుత్వం యోచిస్తున్నది.
కేంద్రంలోని బీజేపీ సర్కారు ఉపాధి స్కీమ్ను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నదని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేశారు. కేంద్రం ఏకపక్ష నిర్ణయాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నదని, కూలీల బతుకులు ఆగమాగమయ్యాయని పేర్కొన్నారు.
కొత్త నిబంధనతో రాష్ట్రంపై ఏటా రూ.1,200 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల అదనపు భారం పడనున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా.. ఉన్న నిధులను గుంజుకునేలా, రాష్ట్రాలను అప్పుల ఊబిలోకి నెట్టేలా ఈ చట్టం ఉందని పేర్కొన్నారు. కేంద్రం కూలీల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు.
