- తొలి వర్షాలకే నలుగురి దుర్మరణం
- కరెంటోళ్ల నిర్లక్ష్యంపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం
హైదరాబాద్ సిటీ, వెలుగు: కరెంటోళ్ల నిర్లక్ష్యం అమాయకులను బలిదీసుకుంటోంది. హైదరాబాద్సిటీలో వర్షాకాలం మొదలైన నాలుగు రోజుల వ్యవధిలోనే విద్యుత్ షాక్తో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుండటంతో రోడ్ల వెంట చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడుతున్నాయి. ఫలితంగా స్తంభాలు వంగడం, విరగడం వంటి ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి. విద్యుత్శాఖ అధికారుల పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరుస ప్రమాదాలు..
సిటీలో గాలివాన మొదలైందంటే చాలు నగరవాసులు వణికిపోతున్నారు. ఏ రోడ్డు మీద ఏ కరెంట్ వైర్ తెగిపడుతుందో.. ఎక్కడ కరెంట్ షాక్తగిలి చనిపోతామో తెలియక ఇంటి నుంచి బయటికి రావడానికే జంకుతున్నారు. బండ్లగూడలో గత మంగళవారం సాయంత్రం కురిసిన భారీ గాలివానకు విద్యుత్ వైర్ తెగి రోడ్డు పక్కనున్న నీటి కుంటలో పడింది. అదే సమయంలో అక్కడికి చాయ్తాగేందుకు వచ్చిన ఆటోడ్రైవర్అఫ్రోజ్(30), తొమ్మిదో తరగతి విద్యార్థి జాఫర్(15) ఆ నీటిలో కాలు పెట్టగానే కరెంట్ షాక్ కొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
శనివారం తెల్లవారుజామున కరెంట్వైర్లు తండ్రీకూతురిని బలి తీసుకున్నాయి. మేడ్చల్జిల్లా అల్వాల్టెలికాం కాలనీలో గాలివానకు చెట్టు కూలి, కరెంట్తీగలపై పడటంతో అవి తెగి కిందపడ్డాయి. ఇది గమనించక తమ కారును పక్కకు తీసేందుకు వచ్చి చౌదరి సందీప్(45), ఇంటర్చదివే ఆయన కూతురు రితిక(16) విద్యుత్షాక్కు గురై ప్రాణాలు పోగొట్టుకున్నారు.
మాన్సూన్ ప్లాన్ ఏమైనట్టు?
వర్షాకాలం ప్రారంభానికి ముందే విద్యుత్శాఖ ఆఫీసర్లుమాన్సూన్ ప్లాన్ అమలు చేయాలి. కానీ, గ్రేటర్హైదరాబాద్ పరిధిలో విద్యుత్సరఫరా చేసే దక్షిణ డిస్కం(టీజీఎస్పీడీసీఎల్) అధికారులు పట్టించుకోవడం లేదని నగర వాసులు ఆరోపిస్తున్నారు. గాలివానకు కరెంట్ తీగలు తెగి కిందపడటంతోనే ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఫీజులు పోయి, రెప్పపాటులో విద్యుత్సప్లై ఆగిపోవాలి. ఆ విధంగా ఆఫీసర్లే ఏర్పాట్లు చేసుకోవాలి. అయితే, ట్రాన్స్ఫార్మర్లను, సబ్ స్టేషన్ల వద్ద విద్యుత్వ్యవస్థను, రోడ్ల వెంట, వీధుల్లో విద్యుత్ తీగలకు తగిలేలా ఉన్న చెట్ల కొమ్మలను తొ లగించడం, లూజ్ వైర్లను సరిచేయడం వంటి వాటిని పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు అంటున్నారు. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో వేలాది మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు పని చేస్తున్నా వినియోగదారుల సమస్యలను చూడరని చెబుతున్నారు.
కోట్లలో కరెంట్ బిల్లులు.. భద్రత ఏదీ?
ప్రతీ నెల రూ.3 వేల కోట్లకు పైగా కరెంట్బిల్లులు చెల్లించే గ్రేటర్హైదరాబాద్లో ఎలాంటి భద్రత వ్యవస్థ లేకపోవడం విడ్డూరంగా ఉందని నగరవాసులు మండిపడుతున్నారు. నగరంలో ఓవర్హెడ్ విద్యుత్ లైన్లను పూర్తిగా తొలగించి, అండర్ గ్రౌండ్ కేబుల్వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అంటున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించి, విద్యుత్ నిలిపివేసేలా 24/7 హెల్ప్లైన్ నంబర్లను సమర్థవంతంగా నిర్వహించడం లేదని ఆరోపిస్తున్నారు.
అల్వాల్ఘటన తర్వాత.. భారీ వర్షాల సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడితే తాకకుండా వెంటనే 1912 నంబర్కు ఫిర్యాదు చేయాలని పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. దీనిపై సోషల్మీడియాలో ట్రోలింగ్జరుగుతోంది. హెల్ప్లైన్కు ప్రతీరోజు వందలు, వేల సంఖ్యలో కంప్లైంట్స్వస్తుంటే పట్టించుకోని దక్షిణ డిస్కం ఆఫీసర్లు.. జాగ్రత్తలు చెబుతున్నారంటూ పోస్ట్లు పెడుతున్నారు.
