హైదరాబాద్, వెలుగు:
షుగర్, బీపీ వ్యాధులకు హైదరాబాద్ కేంద్రంగా మారుతోంది. నగరంలో 19% మంది మాత్రమే బీపీ లేకుండా ఆరోగ్యంగా ఉన్నారని తాజా స్టడీలో తేలింది. అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, ఒకేచోట కూర్చొని పనిచేసే జీవన విధానం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని వెల్లడించింది. ఈ మేరకు కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, గ్లోబల్ హాస్పిటల్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కలిసి చేసిన స్టడీ రిపోర్ట్ను ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మంగళవారం విడుదల చేశారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం, పని ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. బీపీ, షుగర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అవి ప్రాణాంతకంగా మారతాయని హరీశ్ హెచ్చరించారు. 30 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరు బీపీ, షుగర్ టెస్టులు చేయించుకోవాలని, వ్యాధి ఉన్నట్టు తేలితే రెగ్యులర్గా మందులు వాడాలని సూచించారు. సర్వే చేసిన డాక్టర్లను ఆయన అభినందించారు.
ఆరోగ్యవంతులు 19 శాతమే!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 26 నుంచి 50 ఏండ్ల వయసున్న 9 వేల మందిపై ఈ సర్వే చేశారు. ఇందులో 5 వేల మంది వివరాలను విశ్లేషించి రిపోర్ట్ విడుదల చేశారు. ఈ ఐదు వేల మందిలో 40.7 శాతం మందికి బీపీ ఉందని, ఇంకో 39.8 శాతం మందికి బీపీ ముప్పు(ప్రీ హైపర్ టెన్షన్) ఉందని గుర్తించారు. సిస్టోలిక్ ప్రెజర్ 120–139 మధ్య, డయాస్టోలిక్ ప్రెజర్ 80–89 మధ్య ఉంటే ప్రీ హైపర్ టెన్షన్గా పేర్కొంటారు. 19.5 శాతం మందికి బీపీ నార్మల్గా ఉన్నట్టు తేలింది. కరోనాకు ముందు తాము చేసిన స్టడీలో 25 శాతం మందికి మాత్రమే బీపీ ఉండగా, ఇప్పుడు ఏకంగా 40 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోందని కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ విభాగం జాయింట్ సెక్రటరీ, డాక్టర్ సాయి సుధాకర్ అన్నారు. కరోనా వల్ల లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులు, వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు, ఊబకాయం, ఎక్కువ పని గంటలు, ఆర్థిక కష్టాలు, ఉద్యోగాలు కోల్పోవడం వంటి కారణాల వల్ల జనాలు ఒత్తిడికి గురై రోగాల బారిన పడుతున్నారన్నారు. నగరంలో 70 శాతం మంది అధిక బరువు కలిగి ఉన్నారని ఆయన వెల్లడించారు.
ప్రపంచంలోనే అధికం?
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనా ప్రకారం ప్రపంచంలో 20% మంది జనాలకు బీపీ ఉండే అవకాశముంది. ఇండియాలో 22 నుంచి 27% మందికి బీపీ ఉండే చాన్స్ ఉంది. హైదరాబాద్ విషయంలో అంచనాలకు మించి 40% మందికి బీపీ ఉండే అవకాశం ఉందని ఐహెచ్హెచ్ హెల్త్కేర్ ఇండియా గ్రూప్ సీఈవో అనురాగ్ యాదవ్ తెలిపారు. తమ సర్వే ప్రకారం నగరంలోని 70% మందికి అనారోగ్యకర ఆహారపు అలవాట్లు ఉన్నాయని, దీని వల్లే ఇక్కడి జనాల్లో ఎక్కువ మంది రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. ప్రజలు తమ అలవాట్లు మార్చుకోవాలని సూచించారు.
బీపీ కంట్రోల్లో ఉండాలంటే!
కరోనాకు ముందు హైదరాబాద్లో 25% మందికి డయాబెటిస్ ఉంటే, ఇప్పుడు అది 33 శాతానికి చేరినట్టు కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ విభాగం అధ్యక్షుడు, డాక్టర్ రాజీవ్గార్డ్ తెలిపారు. షుగర్, బీపీ లక్షణాలు బయటకు కనపడకపోవడం వల్ల జనాలు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. వీటి ప్రభావం ఇతర అవయవాలపై పడి, పరిస్థితి విషమించే వరకు తెలుసుకోలేక పోతున్నారన్నారు. ఇటీవల వరుసగా జరుగుతున్న సడెన్ స్ర్టోక్లకు ఇవీ కారణాలేనని చెప్పారు. బీపీ కంట్రోల్లో ఉండాలంటే ఆహారంలో ఉప్పు, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలని, రోజూ వ్యాయామం చేయాలన్నారు.
రెగ్యులర్గా బీపీ చెక్ చేయించుకోవాలె
కరోనాకు ముందు దేశంలో 22% నుంచి 27% మందిలో బీపీ ఉన్నట్టు తేలింది. అప్పుడు హైదరాబాద్లో 25% మందిలోనే ఈ సమస్య ఉండగా.. ఇప్పుడు 40% మందిలో ఉన్నట్లు తేలింది. లైఫ్స్టైల్లో వచ్చిన మార్పులు, వ్యాయామం చేయకపోవడం వంటివి బీపీకి కారణం కావొచ్చు. కరోనా వల్ల కూడా అయ్యుండొచ్చు. టెస్ట్ చేసుకునే దాకా బీపీ, షుగర్ ఉన్నట్టు తెలుస్తలేదు. ఫలితంగా కిడ్నీలు పాడవడం, హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్ వంటివన్నీ జరుగుతయి. అందుకే, రెగ్యులర్గా బీపీ చెక్ చేయించుకోవాలి.
- డాక్టర్ సాయి సుధాకర్, కార్డియాలజిస్ట్, గ్లోబల్ హాస్పిటల్.