యూపీలో కోతుల దాడి... 40 మందికి గాయాలు

యూపీలో కోతుల దాడి... 40 మందికి గాయాలు

బరేలి:  కోతుల దాడిలో 40 మంది గాయపడిన ఘటన  ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... బరేలిలోని ఫతేగంజ్ లో ఎక్కడపడితే అక్కడ కోతులే కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. కోతులు ఇళ్లలోకి వచ్చి నానా భీభత్సం చేస్తున్నాయని, ఎదురు తిరిగితే మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం కోతులు ఊర్లోకి రాగా... వాటిని  అక్కడి నుంచి దూరంగా పంపించేందుకు ప్రజలు ప్రయత్నించారు.

 

దీంతో ఆ కోతులు ఒక్కసారిగా వారిపై దాడికి దిగాయి. ఈ దాడిలో దాదాపు 40 మంది గాయపడ్డారు. దీంతో కోతుల దాడి గురించి స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు... కోతులను కేజుల్లో బంధించి  తీసుకెళ్లారు. గాయపడిన వాళ్లను హాస్పిటల్ లో జాయిన్ చేయించి ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి శాశ్వతంగా కాపాడాలని కోరారు.