రాజుల కాలం నాటి శిల్పకళ, వారసత్వ సంపదకి సాక్ష్యాలు

రాజుల కాలం నాటి శిల్పకళ, వారసత్వ సంపదకి  సాక్ష్యాలు

వీకెండ్​ టూర్​ ఎక్కడికి వెళ్లినా.. ఆ ట్రిప్​​ కొత్తగా అనిపించాలి. ఎప్పటికీ గుర్తుండిపోవాలి అనుకుంటారు చాలామంది. అందుకనే చారిత్రక కట్టడాలు, పురాతన దేవాలయాలు ఉన్న ప్రాంతాల్ని చూసేందుకు వెళ్తారు. ఎందుకంటే...ఇవి రాజుల కాలం నాటి శిల్పకళ, వారసత్వ సంపదకి  సాక్ష్యాలు. ‘అలాంటి ప్లేస్​లు ఎక్కడ ఉన్నాయబ్బా!’ అని వెతికే వాళ్లకు మన  రాష్ట్రంలోని  జోగులాంబ గద్వాల్ జిల్లా మంచి ఛాయిస్.

ఒకప్పుడు మహాసంస్థానంగా పేరొందిన ఈ ప్రాంతంలో నాలుగొందల ఏండ్ల నాటి కోట ఉంది. పద్దెనిమిది శక్తి పీఠాల్లో  ఒకటైన జోగులాంబ దేవాలయం ఉంది ఈ జిల్లాలోనే. ఇక్కడికి వెళ్తే తుంగభద్ర, కృష్ణా నదుల మీద కట్టిన డ్యాంలను చూడొచ్చు. బీచు​పల్లి హనుమాన్ ఆలయం కూడా చూడదగ్గదే. మనదేశంలో ‘ఆలయాల నగరం’గా పేరొందిన పట్టణాలు చాలానే. వాటిలో అలంపూర్ ఒకటి.  పద్దెనిమిది మహాశక్తిపీఠాల్లో ఐదోది అయిన జోగులాంబ దేవాలయం ఈ ఊళ్లోనే ఉంది. ఇక్కడ అమ్మవారు ‘రౌద్ర స్వరూపిణి’గా కనిపిస్తారు. గుడి ఆవరణలోని కోనేరు అమ్మవారిని శాంతింపచేస్తుందని చెప్తారు. జోగులాంబ ఆలయం ఉన్న దగ్గర తుంగభద్ర, కృష్ణా నదులు కలుస్తాయి. అందుకనే ఈ గుడిని ‘దక్షిణ కాశి’ అని  పిలుస్తారు. జోగులాంబ గుడి నిర్మాణ శైలి నగర  ఆర్కిటెక్చర్​లో ఉంటుంది.  గుడి మొత్తాన్ని ఒకటే రాయి మీద కట్టడం నగర శైలి ప్రత్యేకత. ఆలయ గోడల మీద పంచతంత్రం, రామాయణ, మహాభారత ఘట్టాలు కనిపిస్తాయి. ఇక్కడ  నవబ్రహ్మ దేవాలయాలు కూడా ఉన్నాయి. వీటిని ఎర్రని ఇసుక రాయితో కట్టారు. పన్నెండేండ్లకు ఒక్కసారి వచ్చే తుంగభద్ర పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వెళ్తారు.  పౌర్ణమి, అమావాస్య రోజుల్లో చండీ హోమాలు చేస్తారు. మాఘశుద్ధ పౌర్ణమి నాడు అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవం కన్నులపండువగా జరుగుతుంది. 

దర్శనం టైమింగ్స్: ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు. మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు.

 గద్వాల్ కోట
గద్వాల్ పేరు వినగానే అందరికీ గద్వాల్​ కోట గుర్తుకొస్తుంది. ఒకప్పుడు మహాసంస్థానంగా ఉన్న ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ల గుర్తు ఈ కోట. దీన్ని1663–1713 మధ్య కాలంలో  సోమశేఖర ఆనంద రెడ్డి కట్టించాడు. ఇతడికి ‘రాజా సోమనాద్రి’ అనే పేరు కూడా ఉంది. మట్టి, రాళ్లతో కట్టిన పెద్ద గోడలు, చుట్టూరా పెద్ద కందకాలు ఉన్న ఈ కోట చూడదగ్గది.  కోట లోపల రాముడి గుడితో పాటు చెన్నకేశవ స్వామి, వేణుగోపాల స్వామి ఆలయాలు కూడా ఉంటాయి. కోనేరు కూడా చూడొచ్చు. ఇక్కడ 32 అడుగుల పొడవున్న ఫిరంగి ఉంది. 

బీచుపల్లి హనుమాన్ గుడి 
కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం  వెనక ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది. గర్భగుడిలోని హనుమంతుడి  విగ్రహాన్ని శ్రీకృష్ణ దేవరాయల గురువు వ్యాసరాయుడు ప్రతిష్ఠించాడని చెప్తారు. అందుకనే ఇక్కడి ఆంజనేయుడిని ‘బీచుపల్లి రాయుడు’గా పిలుస్తారు. బోయవాళ్లు పూజారులుగా ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత. అందుకు కారణం...ఆంజనేయుడి విగ్రహం ప్రతిష్టించి ఆ రోజు రాత్రి అక్కడే నిద్రపోయాడట వ్యాసరాయుడు. కలలో ఆంజనేయుడు కనిపించి...‘తెల్లవారుజామున నన్ను దర్శనం చేసుకునేందుకు మొదట వచ్చిన వాళ్లనే పూజారి చేయాల’ని చెప్పాడట.  దాంతో స్వామి చెప్పినట్టుగానే మొదట వచ్చిన బోయ పిల్లాడికి పూజారి పని అప్పగించాడట. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ఆలయంలో స్వామివారికి బోయ కులస్తులే మొదటి పూజ చేస్తారు. వైశాఖ మాసంలో ఐదురోజులు బ్రహ్మోత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తారు. 

రాజోలి, జూరాల డ్యాం
పరవళ్లు తొక్కే కృష్ణా, తుంగభద్ర నదుల్ని చూడాలంటే గద్వాల్​ వెళ్లాల్సిందే. ఈ రెండు నదుల మీద రెండు డ్యాంలు ఉన్నాయి. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్​లో భాగంగా తుంగభద్ర నది మీద రాజోలి డ్యాం కట్టారు. దీనికి రెండు కాలువలు ఉంటాయి. జూరాల డ్యాంని  కృష్ణా నది మీద కట్టారు. దీన్ని ‘ఇందిరా ప్రియదర్శిని ప్రాజెక్ట్’ అని పిలుస్తారు. వర్షాకాలంలో  నీళ్లతో కళకళలాడే ఈ డ్యాంని చూసేందుకు చాలామంది వెళ్తారు. ఇక్కడి నుంచి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో జింకల పార్క్ ఉంది. రాజోలి డ్యాం కూడా చూడొచ్చు. 

ఇవి కూడా చూడొచ్చు
అలంపూర్​కి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పాపనాసి గ్రామంలో ‘పాపనాసి దేవాలయాలు’ ఉంటాయి. వీటిని రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు కట్టించారు. ఇక్కడికి వెళ్తే... ఏడు, ఎనిమిదో శతాబ్దం నాటి శిల్పకళని చూడొచ్చు. అంతేకాదు ఇక్కడ వివిధ రూపాల్లో, ఎత్తులో ఉన్న 20 శివలింగాలు ఉంటాయి. యజ్ఞశాల, ఆలయ గోడల మీద  అష్టాదశ శక్తిపీఠాల బొమ్మలు చెక్కి ఉంటాయి.