గంజాయి.. అరకు​ టు ముంబై వయా  సిటీ

గంజాయి.. అరకు​ టు ముంబై వయా  సిటీ

సికింద్రాబాద్,వెలుగు ​:  వైజాగ్ ​నుంచి ముంబైకి రైలులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను  సికింద్రాబాద్​ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.  సుమారు రూ.7.20 లక్షల విలువైన 72 కిలోల గంజాయి బ్యాగులను స్వాధీనం చేసుకోగా,  మరో వ్యక్తి పరారయ్యాడు. శనివారం సికింద్రాబాద్​ రైల్వే ఎస్పీ అనురాధ మీడియాకు వివరాలు వెల్లడించారు. మహారాష్ర్టకు చెందిన రైనా సలీమ్​షేక్​(29), పింకి ఫిరోజ్​షేక్​(29) లు మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడి గంజాయి ట్రాన్స్​పోర్ట్​ చేస్తున్నారు. ఈ నెల 2న రైనా సలీమ్​షేక్​, పింకి ఫిరోజ్,​ దీపక్​ సంఘ్లీ(62)లు కలిసి అరకు వెళ్లి అక్కడ పొడి గంజాయిని కొని  వైజాగ్​ నుంచి ఎల్​టీటీ ఎక్స్​ప్రెస్​లో ముంబై వెళ్తున్నారు. సమాచారం అందడంతో రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టగా గమనించి పారిపోతుండగా ఇద్దరు మహిళలను అరెస్ట్ ​చేసినట్టు రైల్వే ఎస్పీ తెలిపారు. 
స్పెషల్​  డ్రైవ్​లో 42  మంది అరెస్ట్​
 రైల్వే పోలీసులు కొద్ది రోజులుగా స్పెషల్​ డ్రైవ్​లో  భాగంగా 20 కేసులు నమోదు చేసి వారి వద్ద సుమారు రూ. కోటికి పైగా విలువైన 685 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. కోణార్క్​, ఎల్​టీటీ, గోదావరి,నాగావళి ,దేవగిరి ఎక్స్​ప్రెస్​రైళ్లలో  తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. ఒడిశాలోని బెర్హంపూర్, భువనేశ్వర్​, బాలాగావ్, ఏపీలోని ఇచ్చాపురం, వైజాగ్​,  రాజమండ్రి, అరకు నుంచి సికింద్రాబాద్​ మీదుగా  ఢిల్లీ , ఆగ్రా, ముంబై, పుణె, ఔరంగాబాద్​ తదితర ప్రాంతాలకు  తరలిస్తున్నట్టు చెప్పారు. 
హాష్​ అయిల్ అమ్ముతూ పట్టుబడిన ముగ్గురు  
హైదరాబాద్‌‌ :  హాష్‌‌ ఆయిల్‌‌ అమ్ముతున్న ముగ్గురిని వెస్ట్‌‌ జోన్‌‌ టాస్క్‌‌ఫోర్స్‌‌ పోలీసులు అరెస్ట్ చేసి రూ.55 వేల విలువైన 20 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కొత్తూరుకు చెందిన బొర సంతోష్‌‌(23), సిటీకి వచ్చి బోరబండలో ఉంటూ ఫ్లిప్‌‌ కార్ట్‌‌లో డెలివరీ బాయ్‌‌గా చేస్తున్నాడు. మహబూబ్‌‌నగర్‌‌‌‌ జిల్లా రావులపల్లికి చెందిన కొల్లపెనింది శోభన్ కుమార్(21), యూసుఫ్‌‌గూడ రహమత్‌‌నగర్‌‌‌‌కి చెందిన నేతల విజయ్‌‌కుమార్‌‌(25)లు కలిసి వైజాగ్​పరిధి పాడేరుకు చెందిన స్మగ్లర్‌‌‌‌ ‌‌ప్రవీణ్‌‌ వద్ద  హాష్​ఆయిల్​వారం రోజుల కిందట రూ.40 వేలకు అర లీటర్​కొన్నారు. 5 ఎంఎల్‌‌ బాటిల్స్‌‌లో ప్యాక్ చేసి ఒక్కోటి రూ.2 వేల నుంచి రూ.3 వేలకు అమ్ముతుండగా వెస్ట్‌‌జోన్‌‌ టాస్క్‌‌ఫోర్స్‌‌ పోలీసులకు సమాచారం అందింది.  కస్టమర్లుగా వెళ్లి హాష్​ఆయిల్​ కావాలని ట్రాప్ చేయగా నిందితులు శనివారం ఉదయం రహమత్‌‌నగర్‌‌ ‌‌బంగారు మైసమ్మ టెంపుల్ వద్దకు రమ్మనడంతో వెళ్లారు. బాటిల్స్‌‌తో వచ్చిన నిందితులను పోలీసులు అరెస్ట్‌‌ చేసి హాష్​ ఆయిల్​స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్​ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌‌ రావు తెలిపారు.