న్యూఢిల్లీ: క్వాలిటీ బాగా లేకపోవడం, ధరలు ఎక్కువగా ఉండటంతో మెజారిటీ జనం కూరగాయలు, పళ్లను ఆన్లైన్లో కంటే సాధారణ దుకాణాల్లోనే కొనడానికి ఇష్టపడుతున్నారు. ఒక సర్వే ప్రకారం దాదాపు 66 శాతం కుటుంబాలు స్థానిక మార్కెట్ల నుంచి తాజా పండ్లను, కూరగాయలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నాయని లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో తేలింది.
అదనంగా 19శాతం మంది వినియోగదారులు స్థానిక కూరగాయల విక్రయదారుల నుంచి కొంటున్నారు. కేవలం ఏడు శాతం మంది మాత్రమే ఆన్లైన్ ఆర్డరింగ్ ప్లాట్ఫారమ్లపై ఆధారపడుతున్నారు. నాణ్యతలేమి, అధిక ధరలు, ఫిర్యాదుల పరిష్కారం ఆలస్యం కావడం, పరిమిత ఎంపికల వంటి సమస్యల వల్ల వీటి కొనుగోలు విషయంలో జనం ఆన్లైన్కు దూరముంటున్నారని లోకల్ సర్కిల్స్ శుక్రవారం తెలిపింది.
కొందరు వినియోగదారులు వేగంగా డెలివరీ పొందడానికి ఈ యాప్లను ఉపయోగిస్తున్నారు. పండ్లు, కూరగాయలను మాత్రం చాలామంది తమ స్థానిక మార్కెట్ దుకాణాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్లాట్ఫారమ్లు మొదట్లో తక్కువ ధరలకు అమ్మాయి కానీ రానురాను వీటిలో ధరలు 1.5-2 రెట్లు పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబరు 1–20 తేదీల మధ్య నిర్వహించిన ఈ సర్వేకు భారతదేశంలోని 297 జిల్లాల్లో ఉన్న వినియోగదారుల నుంచి 24,000 పైగా స్పందనలు వచ్చాయి. ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో కంటే ఇంటి వద్దే తాజా పండ్లు, కూరగాయలు దొరుకుతాయని రెస్పాండెంట్లు చెప్పారు. ఆన్లైన్లో కొన్నవి తాజాగా ఉండటం లేదని, నాణ్యత లోపం గురించి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు.
ఇలాంటి వాటిని వాపసు తీసుకొని వేరేవి ఇవ్వడం లేదని లోకల్ సర్కిల్స్ ఫౌండర్ సచిన్ తపారియా అన్నారు. అయితే కరోనా తరువాత ఎక్కువ మంది వినియోగదారులు ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫారమ్ల వైపు మొగ్గు చూపారు. ఫలితంగా ఆన్లైన్లో కిరాణా సామగ్రి అమ్మకాలు భారీగా పెరిగాయి. పళ్లు, కూరగాయల విషయంలో మాత్రం జనం తిరిగి సాధారణ మార్కెట్లకే వెళ్తున్నారు. చాలా మెట్రోలలో బిగ్ బాస్కెట్, అమెజాన్ ఫ్రెష్, జియో మార్ట్ వంటి ప్లాట్ఫారమ్లతో పాటు బిగ్ బాస్కెట్ డైలీ, బిగ్ బాస్కెట్ నౌ, మిల్క్ బాస్కెట్ వంటి సబ్స్క్రిప్షన్ ప్లాట్ఫారమ్లు, స్విగ్గీ వంటి క్విక్ డెలివరీ ప్లాట్ఫారమ్లు పళ్లను, కూరగాయలను ఆన్లైన్లో అమ్ముతున్నాయి.
ఫుడ్ డెలివరీ, డిజిటల్ పేమెంట్స్...వీటికే స్మార్ట్ఫోన్ వాడకం ఎక్కువ
మనదేశంలోని సగటు స్మార్ట్ఫోన్ యూజర్డిజిటల్ చెల్లింపులు, ఆహారం, కిరాణా డెలివరీలకు స్మార్ట్ఫోన్ను ఎక్కువగా వాడుతున్నాడని శుక్రవారం సైబర్ మీడియా సంస్థ రీసెర్చ్ సీఎంఆర్ స్టడీ వెల్లడించింది. సౌకర్యం, నమ్మకం కారణంగా ఇలాంటి మొబైల్ అప్లికేషన్ల వినియోగం భారీగా పెరిగిందని సీఎంఆర్లో ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ హెడ్ ప్రభు రామ్ అన్నారు. విశ్వాసంతో కూడిన సౌలభ్యం ఆధునిక వ్యాపారాలకు జీవనాధారమని సీఎంఆర్లో పరిశ్రమల కన్సల్టింగ్ గ్రూప్ సీనియర్ మేనేజర్ సుగంధ శ్రీవాస్తవ అన్నారు. ఓటీటీ ప్లేయర్లలో, అమెజాన్ ప్రైమ్ వీడియో స్పష్టమైన లీడర్గా నిలిచిందని, డిస్నీ హాట్స్టార్ రెండవ స్థానంలో ఉందని పేర్కొన్నారు.