- ఐదుగురు అరెస్ట్
నిర్మల్, వెలుగు : మ్యూల్ అకౌంట్లతో సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ఐదుగురిని నిర్మల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ జానకీ షర్మిల గురువారం వెల్లడించారు. లోకే శ్వరం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన నిమ్మ గజేందర్, మగ్గిడి నవీన్, మగ్గిడి మహేందర్, సోన్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన మేకల నిఖిల్, షికారి సాయికృష్ణ 2024 నుంచి తమ వ్యక్తిగతంగా, వివిద వ్యాపార సంస్థల పేరిట పలు బ్యాంకుల్లో కరెంట్ ఖాతాలు ఓపెన్ చేశారు. వీటికి సంబంధించిన ఏటీఎం కార్డులు, చెక్బుక్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను సైబర్ నేరగాళ్లకు అందజేశారు. సైబర్నేరగాళ్లు ఆన్లైన్ పేరిట పలువురిని నమ్మించి ఈ ఖాతాల్లో డబ్బులను డిపాజిట్ చేయించేవారు.
తర్వాత ఆ డబ్బులను ఇతర అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసేవారు. ఇందుకోసం నిందితులు సైబర్ నేరగాళ్ల నుంచి కమీషన్లు తీసుకునేవారు. గజేందర్పై 9, నవీన్పై 28, మహేందర్పై 5, నిఖిల్ పై 16, సాయికృష్ణపై 6 సైబర్ ఫిర్యాదులు ఎన్సీఈఆర్టీ పోర్టల్లో నమోదు అయ్యాయి. దీంతో ఆఫీసర్లు విచారణ జరపడంతో మొత్తం దందా బయటపడింది. నిందితులు ఆయా అకౌంట్లను ఉపయోగించి కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్స్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో గజేందర్, నవీన్, మహేందర్, నిఖిల్, సాయి కృష్ణను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితులను పట్టుకున్న భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ముథోల్ ఇన్స్పెక్టర్ రవీందర్నాయక్, సోన్ ఇన్స్పెక్టర్ గోవర్ధన్రెడ్డి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, ఎస్సైలు గోపి, అశోక్ ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
