
మేడ్చల్, వెలుగు: ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను మేడ్చల్ ఎస్వో టీ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. డీసీఎంలో రూ.50 లక్షల విలువ జేసే ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు ఎస్వోటీ పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు నుంచి నాగపూర్కు రవాణా చేస్తున్నట్టు తెలిసింది. అప్పటికే ఎస్వోటీ పోలీసులు నిఘా వేసి ఉంచగా.. మేడ్చల్ రోడ్డు వద్ద వాహనంపై దాడి చేసి ఇద్దరిని పట్టుకున్నారు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన సత్య బహు, హరి ప్రసాద్ లను నిందితులుగా గుర్తించారు. వారిని అరెస్టు చేసి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసును నమోదు చేసిన అటవీ శాఖ అధికారులు నిందితులను రిమాండ్ కు తరలించారు.