
- స్వయం ఉపాధి కోసం యూత్, మహిళలకు కేటాయింపు
హైదరాబాద్సిటీ, వెలుగు: త్వరలో కొత్త రేషన్కార్డులు ఇవ్వనున్న నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో మరిన్ని రేషన్షాపులు పెంచేందుకు సివిల్సప్లయీస్ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ సర్కిళ్ల పరిధిలో ఎన్ని షాపులున్నాయి? ఎన్ని కొత్త షాపులు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్న విషయమై అధికారులు లెక్కలు తీశారు. ఇప్పటికే ఉన్న షాపుల్లో సకాలంలో తెరవడం లేదని, బినామీ పేర్లతో నడుపుతున్నారని, అర్హులకు కేటాయించని, అక్రమాలకు పాల్పడుతున్నారన్న కారణాలతో దాదాపు 30 రేషన్షాపులను రద్దు చేశారు. దీంతో ఈ షాపులతో పాటు మరో 50 కొత్త షాపుల ఏర్పాటు చేయాలని ప్లాన్చేస్తున్నారు.
కొత్తగా మరో లక్షన్నర మందికి..
హైదరాబాద్పరిధిలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో ఖాళీగా ఉన్న 30 షాపులను తీసి వేస్తే 624 రేషన్షాపులు నడుస్తున్నాయి. నగరంలో ఇప్పుడు 6,39,451 కార్డులున్నాయి. మలక్పేట సర్కిల్లో 69, యాకుత్పురా 83, చార్మినార్96, నాంపల్లి 53, మెహదీపట్నం 82, అంబర్పేట 69, ఖైరతాబాద్81, బేగంపేట 67, సికింద్రాబాద్లో 53 షాపులున్నాయి. ఒక్కో షాపుకు ఆయా ప్రాంతాల్లోని జనాభాను బట్టి 800 నుంచి 1200 కార్డులను కేటాయించారు.
ప్రస్తుతం కొత్త కార్డుల కోసం దాదాపు మరో 4 లక్షల మంది వరకూ దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో రెండు సార్లు దరఖాస్తు చేసుకున్న వారిని తీసేస్తే లక్షన్నర వరకు అర్హులు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అర్హులకు కార్డులు జారీ చేసి ఒక్కో షాపుకు కార్డుల సంఖ్య పెంచాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడున్న విధానంలో కార్డుల సంఖ్యను కేటాయించి కొత్త షాపులను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఖాళీగా ఉన్న 30తో పాటు మరో 50 షాపులు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు
స్వయం ఉపాధి కల్పన
రేషన్షాపుల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభం కావడంతో రేషన్షాపులకు వెళ్లేవారి సంఖ్యబాగా పెరిగింది. రాబోయే కాలంలో మరికొన్ని ముఖ్యమైన నిత్యావసర వస్తువులు కూడా రేషన్షాపుల ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. దీంతో రేషన్ షాపుల్లో అక్రమాలు జరగకుండా ఉండాలంటే పరిమిత సంఖ్యలోనే కార్డులుండాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే, రేషన్పోర్టబులిటీ సదుపాయం కూడా ఉండడంతో కొన్ని రేషన్షాపులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొత్త షాపులను యువతీ యవకులు, మహిళలకు స్వయం ఉపాధి కల్పించేలా కేటాయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
కార్డుల్లో ఇంకా మార్పులు చేర్పులే..
నగరంలో ఇంకా కొత్త రేషన్కార్డుల జారీ ప్రక్రియ మొదలుకాలేదు. ఇంకా పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లను చేర్చడం, తొలగించే కార్యక్రమం నడుస్తోంది. ఎనిమిదేండ్లుగా కొత్త సభ్యులను చేర్చే ప్రక్రియ నిలిపివేయడం, చనిపోయిన వారి పేర్లను తొలగించకపోవడంతో ఇప్పుడు ఈ ప్రక్రియపై అధికారులు దృష్టి పెట్టారు. కొత్త సభ్యుల పేర్లను చేర్చేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య లక్షల్లో ఉండడంతో 25 నుంచి 30 శాతం వరకు ప్రక్రియ పూర్తి చేసినట్టు తెలిపారు. జూన్ మొదటి వారంలో కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలించి, ఇంటింటి తనిఖీలు చేస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.