
- కాంగ్రెస్ఎమర్జెన్సీకి నేటికి 50 ఏండ్లు పూర్తి: ప్రధాని మోదీ
- ఈ రోజు సంవిధాన్ హత్యా దివస్’గా
- ప్రజలకు గుర్తుండిపోతుంది
- పార్లమెంట్ను మూసేసి.. హక్కులను అణచివేసిన్రు
న్యూఢిల్లీ: దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిన ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏండ్లు పూర్తయ్యాయని ప్రధాని మోదీ తెలిపారు. దీన్ని ‘సంవిధాన్ హత్య దివస్’గా ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పారు. దేశంలో ఎమర్జెన్సీని విధించి కాంగ్రెస్ రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించిందని తెలిపారు.
బుధవారం ఆయన ఎమర్జెన్సీకి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ‘ఎక్స్’లో వరుసగా పోస్ట్లు పెట్టారు. ‘‘ఈ రోజున రాజ్యాంగ విలువలను పక్కనపెట్టారు. ప్రాథమిక హక్కులను అణచివేశారు. పత్రికా స్వేచ్ఛను కాలరాశారు. కొందరు రాజకీయ నేతలను, సోషల్వర్కర్స్ను, స్టూడెంట్స్తోపాటు సామాన్య పౌరులను జైల్లో పెట్టారు. నాడు కాంగ్రెస్ సర్కారు ప్రజాస్వామ్యాన్నే అరెస్ట్ చేసింది” అని పేర్కొన్నారు.
పార్లమెంట్ గొంతునొక్కారు
ఎమర్జెన్సీ టైంలో పార్లమెంట్ గొంతును ఎలా అణచివేశారో.. కోర్టులను నియంత్రించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయనేది దేశ ప్రజలెవరూ మరిచిపోరని ప్రధాని మోదీ అన్నారు. వివాదాస్పద 42వ రాజ్యాంగ సవరణ ద్వారా కోర్టులను నియంత్రించడానికి ప్రయత్నాలు జరిగాయని మండిపడ్డారు. 1976 సవరణ అధికారాన్ని కేంద్రీకరించడానికి, న్యాయ పర్యవేక్షణను పరిమితం చేయడానికి రాజ్యాంగంలో పలు మార్పులు చేశారని మండిపడ్డారు. ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకొని, వారిని అగౌరవపరిచారని అన్నారు.
ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పారు. రాజ్యాంగ విధానాలను మరింత బలోపేతంచేసి వికసిత్ భారత్ను నిర్మించేందుకు కమిట్మెంట్తో పనిచేస్తున్నామని, దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేస్తూ కొత్త శిఖరాలను అధిరోహిస్తామని మోదీ ఎక్స్లో రాశారు.