
- పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు
- 22 మంది గల్లంతు.. 130 మందికి గాయాలు
- ఆకస్మిక వరదలు, విరిగిపడుతున్న కొండ చరియలు
- మండి జిల్లాలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం
- నివేదిక విడుదల చేసిన హిమాచల్ ప్రభుత్వం
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదలతోపాటు కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. మొత్తం 51 మంది చనిపోయారు. 22 మంది కనిపించకుండా పోయారు. 130 మంది వరకు గాయపడ్డారు.
హిమాచల్ప్రదేశ్లోని మొత్తం 12 జిల్లాల్లో కుండపోత వానలకు జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈమేరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ జూన్ 20 నుంచి జులై 1 వరకు జరిగిన నష్టానికి సంబంధించిన డేటా బుధవారం రిలీజ్ చేసింది.
మండి జిల్లాలో 10 మంది మృతి
రాష్ట్రంలో వర్షాలకు మండి జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ ఒక్క జిల్లాలోనే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. జిల్లాలో 10 మంది చనిపోయారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి మండి జిల్లాలో 34 మంది ఆచూకీ తెలియకుండా పోయింది. క్లౌడ్ బరస్ట్, ఆకస్మిక వరదలకు మండి జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 204 ఇండ్లు దెబ్బతిన్నాయి. వీటిలో 22 ఇండ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి.
84 షాపులు, పశువుల పాకలు, కార్మికుల గుడిసెలు దెబ్బతిన్నాయి. రూ.88 లక్షలు విలువ చేసే ప్రైవేట్ ప్రాపర్టీలు ధ్వంసం అయ్యాయి. ప్రభుత్వపరంగా అయితే.. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ), జల్ శక్తి విభాగ్ (జేఎస్వీ), పవర్ సెక్టార్ డిపార్ట్మెంట్లు అత్యధికంగా రూ.283 కోట్లు విలువ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నది.
హెల్త్, ఎడ్యుకేషన్, రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లు తీవ్రంగా నష్టాపోయాయి. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. అన్ని జిల్లా నుంచి నష్టం అంచనా వస్తున్నదని, నష్టం మరింత పెరిగే
అవకాశం ఉందని ఎస్ఈవోసీ ప్రతినిధి వివరించారు.
మట్టిలో కూరుకుపోయిన కార్లు, బైక్లు
కాంగ్రా, మండి, చంబా, కుల్లూ, కిన్నూర్, షిమ్లా, ఉనా జిల్లాల్లో భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఆకస్మిక వరదల ధాటికి కార్లు, బైక్లు మట్టి, రాళ్ల మధ్య కూరుకుపోయాయి. వర్షం కారణంగా మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు చనిపోయారు. బిలాస్పూర్, మండి నుంచి ఒక్కొక్కరు, కుల్లూలో ముగ్గురు, చంబాలో ఇద్దరు మృతి చెందారు. జూన్లో మాన్సూన్ కారణంగా 132 మంది చనిపోయారు. 270 మంది గాయపడ్డారు. 830 మూగ జీవాలు మృత్యువాతపడ్డాయి.
దేశ వ్యాప్తంగా వార్నింగ్ లెవల్లో 11 నదులు
దేశవ్యాప్తంగా 11 నదులు వార్నింగ్ లెవల్లోనే ప్రవహిస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ప్రకటించింది. కానీ.. వరదలపరంగా ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. డేంజర్ మార్క్ దాటలేదని ప్రవహించడంలేదని వివరించింది. అస్సాం, బిహార్, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లోని 11 నదులు.. స్థాధారణ స్థాయికి మించి ప్రవహిస్తున్నట్లు తెలిపింది.
కీలక హైవేలన్నీ క్లోజ్
భారీ వర్షాలకు మండి జిల్లాలో బియాస్ నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నది. చండీగఢ్ - మనాలీ హైవేలోని మండి - మనాలీ రూట్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఐఎండీ వార్నింగ్ నేపథ్యంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మండి, సిర్మౌర్ జిల్లాల్లోని దాదాపు 250కిపైగా రహదారులను క్లోజ్ చేశారు.
614 ట్రాన్స్ఫార్మర్లు, 130 నీటి సరఫరా పథకాలు ప్రభావితమయ్యాయి. హిమాచల్కు ఐఎండీ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హిమాచల్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రొటోకాల్ యాక్టివేట్ చేసింది. ఎమర్జెన్సీ హెల్ప్ కోసం పబ్లిక్ హెల్ప్లైన్ నంబర్ 1070ను ప్రకటించింది.