ట్రాకింగ్, ప్యానిక్ బటన్తో 51 కొత్త బస్సులు
బస్సుల్లో అత్యాధునిక సదుపాయాలు : ఆర్టీసీ ఎండీ సజ్జనార్
వచ్చే 3 నెలల్లో మరో 1,000 బస్సులు
హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీలోకి కొత్తగా 51 సూపర్ లగ్జరీ బస్సులు వచ్చాయి. వచ్చే 3 నెలల్లో మరో 1,000 కొత్త బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ట్రాకింగ్ సిస్టమ్తో పాటు ప్యానిక్ బటన్ సదుపాయం ఏర్పాటు చేశారు. ఫైర్ డిటెక్షన్ అండ్ అలారమ్ సిస్టమ్ టెక్నాలజీ కలిగిన 51 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ జెండా ఊపి ప్రారంభించారు. శనివారం ట్యాంక్ బండ్పై జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీకి ప్రధాన ఆదాయం టికెట్ మీదే వస్తున్నదని, దీనిని పెంచుకోగలిగితే సంస్థ ఇన్కమ్ పెరుగుతుందన్నారు. సంస్థకు సొంత ఆదాయం సమకూర్చుకుంటే పీఆర్సీ, డీఏలు, కొత్త బస్సుల కొనుగోలు, అప్పులు, వడ్డీలు, పాత బకాయిల చెల్లింపు తదితర సమస్యలు తీరుతాయని పేర్కొన్నారు. సొంత వాహనాలు వాడుతున్న పబ్లిక్ను ఆర్టీసీ వైపు మళ్లించాలని మంత్రి సూచించారు. ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలు పెద్ద చాలెంజింగ్గా మారిందని సంస్థ ఎండీ సజ్జనార్ అన్నారు. కరోనా లాస్ నుంచి ఇప్పుడిప్పుడే సంస్థ కోలుకుంటోందని పేర్కొన్నారు. పలు బ్యాంకుల సహకారంతో కొత్త బస్సుల కొనుగోలు చేశామని చెప్పారు. ఈ బస్సుల్లో అత్యాధునిక టెక్నాలజీ సదుపాయాలు ఉన్నాయని వెల్లడించారు. త్వరలో హైదరాబాద్లో 300 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని, వాటితో పాటు 10 డబుల్ డెక్కర్ బస్సులు కూడా రాబోతున్నట్లు తెలిపారు.
మునుగోడు బైపోల్ హామీలను అమలు చేయాలె : టీఎంయూ
మునుగోడు బైపోల్ కు ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీఎంయూ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం యూనియన్అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏఆర్ రెడ్డి, థామస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కమలాకర్ గౌడ్, అడ్వైజర్ యాదయ్య.. మంత్రి హరీశ్రావు, చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. రెండు పీఆర్సీల బకాయిలు, 2012 పీఆర్సీ 50 శాతం బకాయిలు చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఆర్టీసీ సమస్యలపై సీఎం కేసీఆర్ తో మాట్లాడానని , త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి చెప్పారని థామస్ రెడ్డి తెలిపారు. అదే విధంగా ఆర్టీసీ టీఎంయూలో రెండు వర్గాలు కలవడంపై మంత్రి అభినందించారని ఆయన పేర్కొన్నారు.
27 నుంచి ‘సింగరేణి దర్శిని’ బస్సులు
సింగరేణి దర్శిని పేరుతో ఈ నెల 27న బస్ భవన్లో చైర్మ న్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ బస్సులు ప్రారంభించనున్నారు. సింగరేణి ప్రాంతాలైన ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, అదిలాబాద్, వరంగల్ జిల్లాలోని పలు కాలరీస్కు హైదరాబాద్ నుంచి బస్సులు నడపనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ టూర్పై సింగరేణి అధికారులతో చర్చించి ఆమోదం తీసుకున్నట్లు తెలుస్తున్నది. కాలరీస్ వరకు పబ్లిక్ను తీసుకెళ్లగా, అక్కడి నుంచి మైన్స్ లోపలికి నామినల్ చార్జ్తో తీసుకెళ్లనున్నట్లు సమచారం.