
ప్రమాదకర కరోనా వైరస్ మహారాష్ట్రను వణికిస్తోంది. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4200 దాటింది. ఆదివారం ఒక్కరోజే 552 కరోనా కేసులు నమోదు కాగా అందులో 456 కేసులు ఒక్క ముంబై నగరంలోనే నమోదయ్యాయి. తాజాగా ఆ నగరంలో 53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. బీఎంసీ నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఈ విషయం బయట పడింది. మొత్తం 193 జర్నలిస్టులు, ఫోటో గ్రాఫర్లకు టెస్టులు చేయగా వారిలో 53 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే టెస్టులు చేయడానికి ముందు వీరెవరికీ కరోనా లక్షణాలు లేకపోవడం గమనార్హం.
ఈ విషయంపై కేంద్రహోంశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. జర్నలిస్ట్ లకు కరోనా సోకడం చాలా దురదృష్టకర విషయమన్నారు. జర్నలిస్ట్ లు ప్రొటోకాల్స్ ఫాలో అవ్వాలని, డ్యూటీకి హాజరైనప్పుడు అవసరమైన ముందుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సోషల్ డిస్టెన్స్ ను పాటించాలని,ఫేస్ మాస్క్ నిబంధనలు పాటించాలని ఆయన తెలిపారు.