- ఇంత భారీ మొత్తం ఎట్ల కేటాయిస్తరు?: హైకోర్టు
- ఏ రూల్స్ ప్రకారం ట్రెజరీ నుంచి నిధులు రిలీజ్ చేశారు?
- అసలు కోర్టు ధిక్కారాలకు ఏ అకౌంట్ నుంచి ఖర్చు చేస్తున్నరు?
- పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ, ఫైనాన్స్, ట్రెజరీకి నోటీసులు
- విచారణ ముగిసే వరకు డబ్బులు విడుదల చేయొద్దని ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కోర్టు ధిక్కరణ కేసుల ఖర్చులకు రూ. 58.95 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇంత భారీ మొత్తంలో ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తారని నిలదీసింది. కోట్ల రూపాయల నిధులను ట్రెజరీ ద్వారా ఎలా రిలీజ్ చేస్తారని, రూల్స్ ఎలా వర్తిస్తాయో చెప్పాలని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రెవెన్యూ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు సీసీఎల్ఏ, ట్రెజరీ డైరెక్టర్లకు నోటీసులిచ్చింది. సీఎస్ సోమేశ్కుమార్కు వ్యక్తిగత ప్రతివాది హోదాలో నోటీసులు జారీ చేసింది.
పిల్పై విచారణ ముగిసే వరకూ మంజూరు చేసిన నిధులను విడుదల చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సీఎస్పై కోర్టు ధిక్కార కేసుల విచారణ ఖర్చులకు జూన్ 7న ప్రభుత్వం జీవో 208 ద్వారా రూ.58.95 కోట్లు మంజూరు చేయడాన్ని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన లెక్చరర్ సీహెచ్ ప్రభాకర్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిల్ను చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి. విజయ్సేన్రెడ్డిల డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది.
జీవోపై సీఎస్సే సంతకం చేశారు: పిటిషనర్
సీఎస్ కోర్టు ధిక్కార కేసుల విచారణకు ఒక్కో కేసుకు రూ. 32.57 లక్షలను సర్కారు కేటాయించిందని.. జీవోపై సీఎస్సే సంతకం చేశారని, అదే సీఎస్ ఇక్కడ లబ్ధిదారుగా ఉన్నారని కోర్టుకు పిటిషనర్ తరఫున సీనియర్ లాయర్ ఎల్. రవిచందర్ చెప్పారు. సీఎస్పై 2013 నుంచి 2021 ఏడాది వరకు 181 కోర్టు ధిక్కార కేసులు ఉన్నాయని, సీసీఎల్ఏపైనా ఉన్నాయని వివరించారు. సీసీఎల్ఏ వినతితో ఆర్థిక శాఖ నిధుల విడుదలకు సమ్మతించడం చట్ట వ్యతిరేకమన్నారు. జీవోను పరిశీలించిన హైకోర్టు.. పెండింగ్ కోర్టు ధిక్కార కేసులంటే ఏంటని ఏజీని ప్రశ్నించింది. ఇంత మొత్తంలో నిధులు ఖర్చు చేయాల్సిన అవసరమేంటని నిలదీసింది. సర్కారు ఏ అకౌంట్ నుంచి కోర్టు ధిక్కార కేసులకు డబ్బు ఖర్చు చేస్తోందని ప్రశ్నించింది. విచారణను అక్టోబర్ 27కి వాయిదా వేసింది.
భూ సేకరణ కేసులకే రిలీజ్: సీఎస్
కోర్టుల్లో పెండింగ్లో ఉన్న భూ సేకరణ పరిహారానికి సంబంధించిన కేసుల విచారణకే రూ.58.95 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారు. భూ సేకరణ కేసుల అప్పీళ్లకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లా జడ్జి రాసిన లేఖను పిల్గా తీసుకుని హైకోర్టు విచారణ చేపట్టిందని, దీనిని పిటిషనర్ తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. సీఎస్ అఫిడవిట్ దాఖలు చేసే సమయానికి పిల్పై హైకోర్టు విచారణ ముగిసి వాయిదా పడింది.