న్యూఢిల్లీ : మనదేశంలో 5జీ స్మార్ట్ఫోన్ల ధరలు 300 డాలర్ల (రూ.21,300) కంటే ఎక్కువగా ఉండకూడదని భారతీ ఎయిర్టెల్ సూచించింది. ఆల్ట్రా ఫాస్ట్ వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సర్వీసులను ఎక్కువ మంది వాడాలంటే.. ధరల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఈ డివైజ్లు రెండేళ్లలోనే పెద్ద ఎత్తున మార్కెట్లోకి విస్తరిస్తాయని నిపుణులు అంచనావేస్తున్నారు. ‘5జీ స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం గ్లోబల్గా వెయ్యి డాలర్లుగా అంటే రూ.71వేలుగా ఉన్నాయి. ఇండియాలో మరింత మంది డేటా వినియోగం చేపట్టాలంటే, ఈ డివైజ్ల ధరలు 300 డాలర్లకు దిగిరావాలని భారతీ ఎయిర్టెల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణదీప్ సెఖోన్ అన్నారు.
ప్రస్తుతం 4జీ ఫోన్లు ఇండియాలో అఫర్డబుల్ కాస్ట్లో రూ.7100కే లభిస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో 5జీ ఫోన్లు కూడా చవగ్గా తీసుకురావాలని సూచించారు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్పాయింట్ అంచనా ప్రకారం గ్లోబల్గా 5జీ స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు 2021 నాటికి 255 శాతం పెరిగి 11 కోట్ల యూనిట్లకు చేరుకోనున్నాయి. మిడ్ నుంచి హై ఎండ్ కస్టమర్ సెగ్మెంట్ నుంచి ఇండియాలో 5జీ డివైజ్లు, సర్వీసులకు డిమాండ్ వస్తుందని కౌంటర్పాయింట్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ అన్నారు.