బిపార్జోయ్ తుఫాన్ ఎఫెక్ట్ తో 67 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ముందు జాగ్రత్తగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రద్దుకు సంబంధించిన టికెట్ల రిఫండ్ ను ప్రయాణికులకు అందిస్తామని తెలిపింది.
బిపార్జోయ్ తుఫాన్ అత్యంత తీవ్ర తుఫాన్ గా మారింది. ఈ తుఫాను గుజరాత్ లోని పోర్ బందర్ కు నైరుతి దిశగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. జూన్ 15న కచ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలోనే బిపార్జోయ తుఫాన్ అంచనా వేసేందుకు ప్రధాని మోడీ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. తీర ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలించేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్, ఆరోగ్యం, తాగునీరు, టెలికమ్యూనికేషన్ వంటి ఎమర్జెన్సీ సేవలకు వాటికి నష్టం జరిగినప్పుడు వాటిని వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు.
కచ్ జిల్లాలోని తీర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు అధికారులు. మత్స్యకారులు ఈ నెల 15 వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని తీరప్రాంతాల్లో హెచ్చరికలు పంపారు. మరోవైపు సముద్రంలో ఉన్న మత్స్యకారులు తీరానికి తిరిగి రావాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు.. తుపాను ప్రభావంతో ముంబయిలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే 67 రైళ్లు రద్దు చేయగా.. గాలుల తీవ్రతతో కొన్ని విమానాలను రద్దు చేశారు. చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.