ఫస్ట్ రోజే 7.46 లక్షలు .. అభయహస్తం గ్యారంటీలకు భారీగా అప్లికేషన్లు

ఫస్ట్ రోజే 7.46 లక్షలు .. అభయహస్తం గ్యారంటీలకు భారీగా అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభలకు జనం పోటెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం గ్రామ సభలు ప్రారంభం కాగా.. అభయహస్తం కింద ఐదు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు క్యూ కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటిరోజే 7,46,414 అప్లికేషన్లు వచ్చాయి. గ్రామాల్లో 2,88,711 దరఖాస్తులు రాగా.. జీహెచ్ఎంసీ సహా ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 4,57,703 దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల్లో భాగమైన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకుంటున్నది. ఇందుకోసం గ్రామాలు, మున్సిపాలిటీలు/కార్పొరేషన్లలో వార్డుల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. జనవరి 6 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాగా, కొత్త రేషన్ కార్డులకు కూడా ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకుంటున్నది. మరోవైపు ఇతర సమస్యలపైనా జనం ఫిర్యాదులు అందజేస్తున్నారు.  

ఆ మూడు గ్యారంటీలకు ఎక్కువ దరఖాస్తులు.. 

అభయహస్తం దరఖాస్తుల్లో ఎక్కువగా మహాలక్ష్మి స్కీమ్ కోసం వస్తున్నాయి. ఒకే ఇంట్లో ఉంటున్న 18 ఏండ్లకు పైబడిన మహిళలు వేర్వేరుగా అప్లికేషన్లు ఇస్తున్నారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం మహిళలకు ప్రతినెల రూ.2,500 ఆర్థిక సాయం అందజేయనుంది. అదేవిధంగా రూ.500కే సిలిండర్ ఇవ్వనుంది. దీంతో ఈ స్కీమ్​ కోసం ఎక్కువ మంది అప్లై చేసుకుంటున్నారు. మహాలక్ష్మి తర్వాత గృహజ్యోతి స్కీమ్​కు అధికంగా దరఖాస్తులు వస్తున్నాయి. దీని కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వనున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఎక్కువ సంఖ్యలోనే దరఖాస్తులు వస్తున్నాయి. కాగా, చేయూత కింద పింఛన్లపై కొంత గందరగోళం ఉండగా అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే పెన్షన్​ పొందుతున్నోళ్లు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అప్లికేషన్​లోనే పెట్టారు. మళ్లీ గురువారం కూడా అధికారులు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అర్హత ఉండి పింఛన్ రానివాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

అప్లికేషన్లు ఫ్రీ.. ఎవరూ కొనొద్దు.. 

అభయహస్తం అప్లికేషన్లను అమ్మి కొందరు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిరాక్స్‌‌ సెంటర్ల వద్ద  కొందరు ఒక్కో అప్లికేషన్​ను రూ.50 నుంచి రూ.100కు అమ్ముతున్నారు. ఉదయం నుంచి లైన్‌‌లో వేచి చూసినా దరఖాస్తు ఫారమ్స్ ఇవ్వడం లేదని కొన్నిచోట్ల ప్రజలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ కేపీహెచ్‌‌బీ రమ్య గ్రౌండ్‌‌ వార్డు కార్యాలయంలో అప్లికేషన్లు ఇవ్వడం లేదని స్థానికులు నిరసన తెలిపారు. అయితే అప్లికేషన్లు అందుబాటులో లేకపోవడం, కొందరు వాటిని అమ్ముతుండడంపై ప్రభుత్వం స్పందించింది. అప్లికేషన్లు ఫ్రీగా అందజేస్తామని, ఎవరూ కొనొద్దని తెలిపింది. ‘‘అభయహస్తం అప్లికేషన్లను ప్రభుత్వమే ఫ్రీగా ఇస్తుంది. గ్రామ సభలు జరిగే ప్రాంతాల్లో ఒకట్రెండు రోజుల ముందే పంపిణీ చేస్తుంది. ఎవరు కూడా డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. గ్రామసభ నిర్వహించే రోజు కూడా సంబంధిత గ్రామసభలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి” అని ప్రకటించింది. ఎవరైనా అప్లికేషన్ ఫారమ్స్ అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

ఊళ్ల బాట పట్టిన జనం..

అభయహస్తం గ్యారంటీలకు దరఖాస్తు చేసుకునేందుకు హైదరాబాద్​తో పాటు వివిధ పట్టణాల నుంచి జనం ఊళ్లకు తరలివెళ్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. రోజుకు రెండు గ్రామాల్లో మాత్రమే సభలు నిర్వహించి అప్లికేషన్లు తీసుకుంటారు. ఎక్కడైతే దరఖాస్తుల స్వీకరణ ఉంటుందో ఒకరోజు ముందే ఆ ఊర్లో చాటింపు వేయిస్తారు.  అయితే ఇది తెలియక కొంతమంది గురువారమే గ్రామాలకు వెళ్లారు. దరఖాస్తులు తీసుకుని సంబంధిత పంచాయతీల్లో ఉదయం 9 గంటల నుంచే బారులు తీరారు. కాగా, జనవరి 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు జరుగుతాయి. రాష్ట్రంలోని 12,769 పంచాయితీలు.. 3,626 మున్సిపల్ వార్డులు కలిపి మొత్తం 16,395 చోట్ల సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 3,714 బృందాలు పని చేస్తున్నాయి. దాదాపు పది శాఖలకు చెందిన అధికారులతో కూడిన బృందం రోజుకు రెండు గ్రామాలు లేదా రెండు వార్డుల్లో సభలు నిర్వహిస్తున్నది.

క్యాస్ట్, ఇన్ కమ్ అక్కర్లే.. 

అభయహస్తం అప్లికేషన్లకు రేషన్​కార్డుతో పాటు ఆధార్​కార్డును జత చేయాలని ప్రభుత్వం తెలిపింది. రేషన్​కార్డు లేనోళ్లు కూడా అప్లై చేసుకోవచ్చని చెప్పింది. దీంతో కొత్త రేషన్​ కార్డు కోసం వినతిపత్రం ఇవ్వడంతో పాటు అభయహస్తం గ్యారంటీలకు కొంతమంది అప్లై చేసుకుంటున్నారు. అయితే రేషన్ కార్డు లేని కొందరు ఇన్​కమ్ సర్టిఫికెట్​ను జత చేస్తుండడం, మరికొందరు దరఖాస్తులతో పాటు క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా ఇస్తుండడంతో కొంత గందరగోళం నెలకొన్నది. క్యాస్ట్, ఇన్​కమ్​సర్టిఫికెట్లు గానీ, ఓటరు కార్డు గానీ జత చేయాలని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. దీనిపై అధికారులు కూడా క్లారిటీ ఇచ్చారు. కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో ఏ వర్గమో టిక్​చేస్తే సరిపోతుందని.. దానికోసం క్యాస్ట్​సర్టిఫికెట్ పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇన్​కమ్ సర్టిఫికెట్​కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు.