
- ఆర్బీఐ అంచనా
ముంబై: గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న డిమాండ్, ఆహారేతర వ్యయం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో భారతదేశం 7.5 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని ఆర్బీఐ మే బులెటిన్ పేర్కొంది. సరఫరా గొలుసుపై భౌగోళిక, రాజకీయ ఇబ్బందులు ప్రభావం చూపుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుందని ప్రశంసించింది. ఆర్బీఐ ఆర్థిక కార్యకలాపాల సూచిక (ఈఏఐ) ప్రకారం, ఏప్రిల్లో కార్యకలాపాలు పుంజుకున్నాయి.
ప్రభుత్వం జనవరి–-మార్చి, 2024 (నాలుగో క్వార్టర్ 2023-–24) క్వార్టర్లీ జీడీపీ అంచనాలను, 2023–-24 సంవత్సరానికి జాతీయ ఆదాయం తాత్కాలిక అంచనాలను మే 31న విడుదల చేస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ జూన్ క్వార్టర్లో 8.2 శాతం, సెప్టెంబర్ క్వార్టర్లో 8.1 శాతం, 2023–-24 డిసెంబర్ క్వార్టర్లో 8.4 శాతం పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్లో టోల్ వసూళ్లు 8.6 శాతం (వార్షికంగా) పెరిగాయి. ఆటోమొబైల్ అమ్మకాలు 25.4 శాతం పెరిగాయి.
టూ, త్రీవీలర్లు భారీగా అమ్ముడయ్యాయి. అయితే ప్రయాణీకుల వాహనాలు రికార్డుస్థాయిలో అమ్ముడయ్యాయి. ఇదిలా ఉంటే భారతదేశం దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఎకానమిక్ టేకాఫ్ మొదలయిందని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ నేతృత్వంలోని బృందం రూపొందించిన ఈ బులెటిన్ పేర్కొంది. ఒక వర్ధమాన దేశం సంపన్నదేశంగా మారే దశను ఎకానమిక్టేకాఫ్అంటారు.
ఆహారేతర వ్యయం పెరుగుతోందని, ద్రవ్యోల్బణం తగ్గుతోందని తెలిపింది. గత రెండు సంవత్సరాలలో మొదటిసారిగా, గ్రామాల నుంచి ఎఫ్ఎంసీజీ ప్రొడక్టులకు డిమాండ్ పట్టణ మార్కెట్లను అధిగమించిందని కూడా పేర్కొంది.