- ఆర్మీ మాజీ చీఫ్ నరవణే బుక్లోని అంశాలు ప్రస్తావించొద్దన్న స్పీకర్
- ప్రతిపక్ష సభ్యుల నిరసన.. స్పీకర్ చైర్పైకి కాగితాలు విసరడంతో ఉద్రిక్తత
- చైనా ఆక్రమణపై రాహుల్ ఆరోపణలను తప్పుబట్టిన అధికారపక్ష సభ్యులు
- 8 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్.. సభ వాయిదా
న్యూఢిల్లీ:ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే పుస్తకంపై లోక్సభలో రెండోరోజు రగడ కొనసాగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంగళవారం లోక్సభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 12 గంటలకు సమావేశం ప్రారంభం కాగానే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. 2020 నాటి భారత్-–చైనా ఉద్రిక్తతల గురించి ప్రస్తావించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయత్నించడంతో సభలో గందరగోళం నెలకొన్నది. ఇంకా ప్రచురితం కాని ఈ బుక్పై సభలో మాట్లాడడం నిబంధనలకు విరుద్ధమంటూ సభాపతి అనుమతి నిరాకరించారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. కొందరు ఎంపీలు స్పీకర్ చైర్పై కాగితాలు విసిరారు. సెక్రటరీ జనరల్ బెంచ్పైకి ఎక్కి నినాదాలు చేశారు. దీంతో సభ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడింది.
ఎనిమిది మంది ఎంపీల సస్పెన్షన్
తిరిగి సభ ప్రారంభం కాగానే.. ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు 8 మందిని సస్పెండ్ చేయాలని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ సెషన్ ముగిసే వరకు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. సభా మర్యాదలకు విఘాతం కలిగించారనే ఆరోపణలతో 8 మంది ఎంపీలను ప్రస్తుత సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ చైర్లో ఉన్న దిలీప్ సైకియా ప్రకటించారు. సభకు అధ్యక్షత వహిస్తున్న కృష్ణ ప్రసాద్ తెన్నేటి పట్ల అనుచితంగా ప్రవర్తించారనే కారణంతో వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు. సస్పెండ్ అయిన వారిలో కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, గుర్జీత్ ఓజ్లా, రాజా వారింగ్, హిబి ఈడెన్, చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రశాంత్ పడొలె, డీన్ కురియకోస్, సీపీఎం ఎంపీ ఎస్ వెంకటేశన్ ఉన్నారు.
బీజేపీ ఘాటు విమర్శలు..
ఆర్మీ మాజీ చీఫ్ చెప్పని విషయాలను లేదా ఇంకా ధృవీకరించని అంశాలను సభలో ప్రస్తావించడం నిబంధనలకు విరుద్ధమని కిరణ్ రిజిజు అన్నారు. రాహుల్ మొండిగా వ్యవహరించడం సరికాదన్నారు. రాహుల్ పార్లమెంటరీ వ్యవస్థను అవమానించారని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. ‘‘భారత సైనికులను అవమానించడమే కాంగ్రెస్ ఏకైక ఎజెండా. స్పీకర్ అనుమతి లేకుండా మాట్లాడకూడదన్న కనీస జ్ఞానం కూడా రాహుల్కు లేదు”అని మండిపడ్డారు.
గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎంపీల నిరసన..
తమ పార్టీ సభ్యులపై తీసుకున్న చర్యను ఖండిస్తూ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నదని, చర్చకు అవకాశం ఇవ్వకుండా సస్పెన్షన్లతో భయపెట్టాలని చూస్తున్నదని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. లోక్ సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ మాట్లాడకుండా మైక్ కట్ చేయడాన్ని ప్రశ్నిస్తే తమను సస్పెండ్ చేశారని మండిపడ్డారు. అ8 మందిపై కావాలనే సస్పెన్షన్ వేటు వేశారన్నారు. ‘‘మా నోరు మూయించాలనే బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తున్నది. మిగతా ఎంపీలందరూ మా తరఫున సభలో ప్రశ్నిస్తూనే ఉంటారు. సస్పెండ్ అయిన 8 మంది ఎంపీలం నేడు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేస్తాం’’ అని చెప్పారు.
అసలేం జరిగిందంటే..
రాహుల్ గాంధీ ఒక ఆర్టికల్ను ప్రస్తావిస్తూ, అది జాతీయ భద్రతకు సంబంధించినదని, తాను ధృవీకరించి ఇచ్చానని చెప్పారు. మాట్లాడేందుకు అనుమతించాలని పట్టుబట్టడంతో.. స్పీకర్ చైర్ లో ఉన్న కృష్ణ ప్రసాద్ తెన్నేటి స్పందిస్తూ.. ‘‘ముందు ఆ పత్రాన్ని సభలో సమర్పించండి. మేం పరిశీలించి నిర్ణయం చెబుతాం” అని అన్నారు. సభలో తనను మాటిమాటికీ అడ్డుకోవడంపై రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రపతి ప్రసంగంలో జాతీయ భద్రత ప్రధాన అంశంగా ఉంది. చైనా-అమెరికా మధ్య వైరుధ్యం మన బడ్జెట్ను కూడా ప్రభావితం చేస్తుంది. తూర్పు లడఖ్లో మన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మాట్లాడాలని అనుకుంటే నన్ను ఎందుకు ఆపుతున్నారు?’’ అని ప్రశ్నించారు. ‘‘నేను ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు.. నేను ప్రతిపక్ష నాయకుడిని” అని వ్యాఖ్యానించారు. దీనికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బదులిస్తూ.. ‘‘సభలో ఎవరైనా, ఏ పదవిలో ఉన్నా సరే.. స్పీకర్ అనుమతితోనే మాట్లాడాలి”అని స్పష్టం చేశారు. చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్..రిజిజు వ్యాఖ్యలను తప్పుబడుతూ సభాపతిని ఉద్దేశించి ‘యార్’ అని సంబోధించారు. దీనిపై తెన్నేటి తీవ్రంగా స్పందిస్తూ.. ‘‘నన్ను ‘యార్’ అనడం ఏమిటి? సభాపతితో మాట్లాడే పద్ధతి ఇదేనా?’’ అని నిలదీశారు. దీని తర్వాతే పరిస్థితి చేయి దాటి ప్రతిపక్ష ఎంపీలు టేబుల్స్ పైకి ఎక్కారు.
