
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఓ కేసు విషయంలో అసలు ముద్దాయికి బదులు నకిలీ ముద్దాయిని ప్రవేశపెట్టినందుకు గాను, 8 మందికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వి.శివనాయక్ మంగళవారం తీర్పు ఇచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. 2010లో ఇరుపక్షాలు కొట్టుకున్న కేసు 2013లో ఫైనల్కు వచ్చింది. తీర్పు ఇచ్చే టైంలో అసలు ముద్దాయికి బదులు మరో వ్యక్తి కోర్టుకు హాజరవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్పటి ఇన్స్పెక్టర్ కోర్టుకు సమాచారం ఇచ్చారు. కోర్టుకు హాజరైన ముద్దాయిలను రెండు సార్లు అడిగితే వారు మౌనంగా ఉండడంతో అప్పటి మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.కిరణ్మయి వాళ్ల పూర్తి వివరాలు, ఆధార్ కార్డులతో సహా అందించాలని కోర్టు కానిస్టేబుల్ను ఆదేశించారు.
కోర్టులో కేసు నడుస్తున్న క్రమంలోనే గోనేమల్ల నాగరాజు దుబాయ్ వెళ్లిపోయాడు. ఆధార్ కార్డులను పరిశీలించగా, నాగరాజు స్థానంలో చిత్తారి సూర్యనారాయణ అటెండ్ అవుతున్నట్లు గుర్తించారు. నాగరాజు స్థానంలో తాను హాజరైనట్లు చిత్తారి సూర్యనారాయణ అంగీకరించాడు. దీంతో జడ్జి కిరణ్మయి 2013, సెప్టెంబర్లో వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జి షీట్ దాఖలు చేశారు. 12 మంది సాక్షులను విచారించిన అనంతరం ఎనిమిది మందికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. జడ్జి ముందు నకిలీ ముద్దాయిని ప్రవేశపెట్టినందుకు లాయర్ దుర్గారావుకు కూడా శిక్ష విధించారు. ఏపీపీవో ఎన్.లావణ్య ప్రాసిక్యూషన్ నిర్వహించారు.