
సింగపూర్: ఆసియా కప్ లెగ్ 2 ఆర్చరీ టోర్నమెంట్లో ఇండియా జూనియర్ ఆర్చర్లు రెండు స్వర్ణాలు సహా తొమ్మిది పతకాలు సాధించారు. రికర్వ్, కాంపౌండ్లో మొత్తం పది విభాగాల్లో ఏడింటిలో ఫైనల్స్ చేరుకున్నప్పటికీ కేవలం రెండింటిలో గెలిచారు. మిగిలిన ఐదు ఫైనల్స్లో ఓడి రజతాలతో సరిపెట్టారు.
ఒలింపిక్ విభాగమైన రికర్వ్లో ఇండియా ఒక్క స్వర్ణ పతకాన్ని కూడా గెలవలేదు. విష్ణు చౌదరి, పారస్ హూడా, జుయెల్ సర్కార్తో కూడిన టాప్ సీడ్ ఇండియా మెన్స్ టీమ్ తుది పోరులో 0–6తో జపాన్ చేతిలో చిత్తయింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో నాలుగో సీడ్ విష్ణు చౌదరి–వైష్ణవి పవార్ జోడీ 32–35తో ఇండోనేసియా ప్రత్యర్థి చేతిలో ఓడింది. కాంపౌండ్ ఆర్చర్లు ఫర్వాలేదనిపించారు.
మెన్స్ ఫైనల్లో టాప్ సీడ్ కుశాల్ దలాల్ 149-–143తో ఆస్ట్రేలియాకు చెందిన జాషువా మానన్ను ఓడించి స్వర్ణం సాధించాడు. కాంస్య పతక పోరులో పదో సీడ్ సచిన్ చేచి 148–-146తో నాలుగో సీడ్ హిము బచ్చర్ను ఓడించాడు. విమెన్స్ ఫైనల్లో రెండో సీడ్ తేజల్ సాల్వే 146-–144తో ఏపీ అమ్మాయి, టాప్ సీడ్ షణ్ముఖి నాగ సాయిపై గెలిచి స్వర్ణం సాధించింది. కానీ, మెన్స్, విమెన్స్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో ఇండియా జట్లు తడబడి రజతాలతో సంతృప్తి చెందాయి.
టాప్ సీడ్గా బరిలోకి దిగిన మెన్స్ కాంపౌండ్ టీమ్ 231-–235తో మూడో సీడ్ కజకిస్తాన్ చేతిలో ఓడగా.. విమెన్స్ కాంపౌండ్ టీమ్ 232–232 (26–29) షూటాఫ్లో తమ కంటే తక్కువ ర్యాంకర్ మలేసియా చేతిలో ఓడింది. షణ్ముఖి, దలాల్తో కూడిన మిక్స్డ్ కాంపౌండ్ టీమ్ ఫైనల్లో సగం దూరం వరకు ఆధిక్యంలో ఉన్నప్పటికీ తర్వాత తడబడి షూటాఫ్లో కజకిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది.