
- ప్రజా ప్రభుత్వం సాధించిన ఘనత ఇది
- ఈ సంతోషకర విషయాన్నిరైతులకు తెలియజేయాలి
- నేటి సాయంత్రం నుంచి రైతు వేదికల వద్ద సంబురాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు
హైదరాబాద్, వెలుగు: కేవలం 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్లను రైతు భరోసా కింద రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డు అని, ప్రజా ప్రభుత్వ సాధించిన ఘనత అని చెప్పారు. సోమవారం గాంధీ భవన్ లో జై బాపు, జై భీం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. పీసీసీ చీఫ్మహేశ్ గౌడ్ అధ్యక్షత వహించగా.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్, భట్టి విక్రమార్క, పలువురు నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఈ సంతోషకర విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు తెలియజెప్పేందుకు మంగళవారం సాయంత్రం అన్ని రైతు వేదికల వద్ద సంబురాలు చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం రైతు భరోసాకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని, అందులో భాగంగానే గతంలో ఎకరాకు రూ. 10 వేలు ఉంటే, ఇప్పుడు రూ. 12 వేలు ఇస్తున్నామని చెప్పారు. గతంలో 5, 10 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అనే పరిమితులు ఉండేవని, కానీ ఇప్పుడు అలాంటి పరిమితులు లేకుండా సాగుకు అనుకూలమైన భూములకు రైతు భరోసా ఇస్తున్నామని చెప్పారు.