ప్రాణాలు తీస్తున్న ఎండలు... భయపెడుతున్న వడగాల్పులు

ప్రాణాలు తీస్తున్న ఎండలు... భయపెడుతున్న వడగాల్పులు

మండే ఎండలు ప్రజల ప్రాణాలను తీసేస్తున్నాయి. వడగాల్పులు,ఎండ వేడిమికి తట్టుకోలేక జనాలు మృత్యువాత పడుతున్నారు.దీంతో ప్రజలు బయటకు వెళ్లడానికి జం కుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లిన వృద్ధులు, చిన్నపిల్లలు అస్వస్థతకు గురవుతున్నారు. 

మండుతున్న ఎండలు

నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇంకా ఎండలు మండుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  హీట్ వేవ్ తీవ్రత వల్ల ఉత్తరప్రదేశ్, బిహార్  రాష్ట్రాల్లో దాదాపు  98 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.   ఎండ తీవ్రతకు 54 మంది యూపీలో ప్రాణాలు కోల్పోగా.. 44 మంది బిహార్‌లో చనిపోయారు.

 బిహార్ లో 44 మంది, యూపీలో 54 మంది మృతి

బిహార్‌లో తీవ్రమైన హీట్‌వేవ్ వల్ల గడిచిన 24 గంటల్లో (వార్త రాసే సమయానికి)  44 మంది మృతి చెందారు. చనిపోయిన 44 మందిలో 35 మంది పాట్నాలోనే చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం( జూన్ 17)న బిహార్ లో  దాదాపు 11 జిల్లాల్లో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా..పాట్నాలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. జూన్ 15,16,17,18న ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

జూన్ 24 వరకు స్కూళ్లకు సెలవులు

ఎండల తీవ్రత వల్ల జూన్ 24 వరకు పాట్నాలో పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఇతర జిల్లాల్లో కూడా విద్యాసంస్థలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జూన్ 19న కూడా తీవ్రమైన హీట్‌వేవ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ఔరంగాబాద్, రోటాస్, బోజ్‌పూర్, బుక్సార్ తదితర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో కూడా ఎండలు తీవ్రంగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం వేసవి సెలవులు జూన్ 30 వరకు పొడగించింది.

ఆరోగ్య సమస్యలు

ఎండ తీవ్రత వలన  చాలా మంది ప్రజలు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది సహా ఇతర సమస్యలతో ఆసుపత్రికి పోటెత్తినట్లు అధికారులు తెలిపారు. బాలియా జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో దాదాపు 400 మంది చేరినట్లు పేర్కొన్నారు. చికిత్స తీసుకుంటున్నవారిలో ఎక్కవ మంది 60 ఏళ్ల పైబడిన వారే ఉన్నారని చెప్పారు. ఆస్పత్రిలో చేరిన వారందరూ కూడా పలు అనారోగ్యాలతో బాధపడుతున్నారని.. అధిక ఉష్ణోగ్రతల వల్ల వారి పరిస్థితి మరింత దిగజారిందని వైద్యులు చెబుతున్నారు.  శనివారం(జూన్17) బాలియా జిల్లాలో  42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ అధికారులు తెలిపారు.