హైదరాబాద్‌లో సరికొత్త క్రీడా సంస్కృతి.. గల్లీలో పికిల్ ‌బాల్ మ్యాచ్లు

హైదరాబాద్‌లో సరికొత్త క్రీడా సంస్కృతి.. గల్లీలో పికిల్ ‌బాల్ మ్యాచ్లు

హైదరాబాద్‌‌: హైదరాబాద్‌‌లో పికిల్‌‌బాల్ ఆట సరికొత్త క్రీడా సంస్కృతికి తెరలేపింది. ఐపీఎల్‌‌ మాదిరిగా కాకుండా యూరోప్‌‌ ఫుట్‌‌బాల్‌‌ లీగ్‌‌ తరహాలో స్థానిక క్లబ్‌‌ సంస్కృతిని ప్రోత్సహిస్తూ ‘సెంటర్‌‌ కోర్టు పికిల్‌‌బాల్‌‌ క్లబ్‌‌ లీగ్‌‌ (సీసీపీఎల్‌‌) నగర వ్యాప్తంగా పోటీలను నిర్వహించింది. గత 9 వారాల్లో 20 జట్లు రెండు కాన్ఫరెన్స్‌‌లుగా విడిపోయి నగరంలోని 19 వేదికల్లో మ్యాచ్‌‌లు ఆడాయి. 

ఆబిడ్స్‌‌, హబ్సిగూడ, జూబ్లీహిల్స్‌‌, కొండాపూర్‌‌, కూకట్‌‌పల్లి, తెల్లాపూర్‌‌ వంటి ప్రాంతాల్లో హోమ్‌‌ అండ్‌‌ అవే ఫార్మాట్‌‌లో మ్యాచ్‌‌లు జరిగాయి. ఈ లీగ్‌‌లో పాల్గొనేందుకు 350 మంది ప్లేయర్లు పేర్లు నమోదు చేసుకోగా, 220 మంది బరిలోకి దిగారు. ఇందులో 40 మంది మహిళలు కూడా ఉన్నారు. 21 ఏళ్ల లోపు యువ ఆటగాళ్లు 20 మందికి పైగా రాణించారు. 

ఇక 20 వేల మంది లైవ్‌‌ స్ట్రీమింగ్‌‌లో చూడగా, 8 వేల మంది ప్రత్యక్షంగా వీక్షించారు. వారాంతంలో జరిగే టోర్నీ మాదిరిగా కాకుండా దీర్ఘకాలిక క్లబ్‌‌ సంస్కృతిని నిర్మించడమే తమ ముందున్న లక్ష్యమని సెంటర్‌‌ కోర్టు స్పోర్ట్స్‌‌ అండ్‌‌ ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌ సహ వ్యవస్థాపకుడు యశ్వంత్‌‌ బియ్యాల వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా విజయవంతమైన క్రీడా వ్యవస్థలన్నీ స్థానిక గుర్తింపు ఆధారంగానే అభివృద్ధి చెందాయన్నాడు.

 ఈ సరికొత్త విధానం వల్ల ఆటగాళ్లు, అభిమానుల మధ్య బలమైన అనుబంధం ఏర్పడిందని మరో సహ వ్యవస్థాపకుడు విక్రాంత్ రావు పేర్కొన్నారు. ఆటగాళ్లు తమ సొంత కోర్టులను కాపాడుకోవడానికి శ్రమించగా, స్థానిక ప్రజలు తమ ప్రాంతపు జట్లకు మద్దతుగా నిలిచారన్నారు. ఈ లీగ్ తమకు అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చిందని, క్రమబద్ధంగా ఆడుతూ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, మరిన్ని పెద్ద అవకాశాలు అందుకోవడానికి ఇది వేదికగా నిలిచిందని వైకింగ్స్ పీసీ క్రీడాకారిణి అభయ వేమూరి 
ఆనందం వ్యక్తం చేసింది.