- విద్య, వైద్యం, వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం
ఖమ్మం టౌన్, వెలుగు : ‘ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు నమ్మకం, భరోసా కలిగిస్తుంది, తెలంగాణలో పుట్టడం అదృష్టంగా భావించేలా ఉంది, బడ్జెట్ అంకెల గారడీ కాదు.. ప్రజల జీవనస్థితిని మెరుగుపరిచేలా ఉంది’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఆదివారం ఖమ్మం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. బడ్జెట్లో విద్య, వైద్యం, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఉందన్నారు.
యజమాని చనిపోతే కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతోనే రూ. 5 లక్షల జీవిత బీమా కల్పించామన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే స్టూడెంట్స్ ఆరోగ్య రక్షణ కోసమే మూడు రోజుల పాటు రాగి జావ, మూడు రోజులు పాలను అందిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగులకు అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్లలో ట్రైనింగ్ ఇస్తూ.. వారు ప్రపంచంతో పోటీ పడేలా తయారు చేస్తున్నామన్నారు.
ప్రతి ఉద్యోగికి క్యాష్ లెస్ హెల్త్ కార్డుతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్కు సైతం వర్తించేలా చర్యలు చేపట్టామన్నారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు సమీపంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కొండబాల కోటేశ్వరరావు, దొబ్బల సౌజన్య, జావీద్, తిలక్
పాల్గొన్నారు.
