స్కూటీని ఢీకొట్టిన లారీ.. విద్యార్థిని మృతి

స్కూటీని ఢీకొట్టిన లారీ.. విద్యార్థిని మృతి
  • ఉప్పల్ పీఎస్ పరిధిలో ఘటన

ఉప్పల్, వెలుగు: స్కూటీని లారీ ఢీకొట్టడంతో డిగ్రీ స్టూడెంట్ చనిపోయిన ఘటన ఉప్పల్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకానగర్ లో ఉంటున్న సారిక, గణేశ్ నగర్ లో ఉంటున్న శివాని గౌడ్(19) ఇద్దరూ ఫ్రెండ్స్. వీళ్లు హబ్సిగూడలోని శ్రీ మేధా డిగ్రీ కాలేజీలో బీకామ్ ఫస్టియర్ చదువుతున్నారు. సోమవారం సాయంత్రం ఇద్దరూ కలిసి స్కూటీపై కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్నారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డుపై వర్షపు నీరు ఉండటంతో సారిక స్కూటీని నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ వెళ్తుండగా.. అదే టైమ్ లో ఓవర్ స్పీడ్​తో వచ్చిన ఓ లారీ వెనుకనుంచి వీరి బైక్​ను ఢీకొట్టింది. స్కూటీ వెనుకాల కూర్చున్న శివాని కిందపడిపోయింది. ఆమె తలమీదుగా లారీ టైర్లు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సారికకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమెను దగ్గరలోని హాస్పిటల్ కు తరలించారు. శివాని తండ్రి శ్రీనివాస్ ఇచ్చిన కంప్లయింట్ మేరకు పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. స్కూటీని ఢీకొట్టి వెళ్లిన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

గూడ్స్ వెహికల్ ఢీకొని మరొకరు..

చేవెళ్ల: స్కూటీని గూడ్స్ వెహికల్ ఢీకొట్టడంతో యువకుడు చనిపోయిన ఘటన మొయినాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం పోలేపల్లికి చెందిన పస్తుల వెంకటేశ్(21) మొయినాబాద్ లోని అజీజ్ నగర్ లో ఉంటూ ఎలక్ట్రిషీయన్ గా పనిచేస్తున్నాడు. వెంకటేశ్ సోమవారం  నార్సింగి నుంచి అజీజ్ నగర్ కు స్కూటీపై బయలుదేరాడు. గండిపేట క్రాస్ వద్ద వెనుక నుంచి వచ్చిన గూడ్స్ వెహికల్ అతడి బైక్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వెంకటేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. 

కారు ఢీకొని ఇద్దరికి గాయాలు

గండిపేట: ఆగి ఉన్న కారును మరో వెహికల్ ఢీకొనగా.. ఇద్దరు గాయపడ్డ ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఆదివారం రాత్రి శంషాబాద్ నుంచి పీవీ నర్సింహారావు ఎక్స్ ప్రెస్ మీదుగా ఓ కారు మెహిదీపట్నం వైపు వెళ్తోంది. పిల్లర్ నం.130 వద్ద ఆగి ఉన్న మరో కారును ఈ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో  ఇద్దరు స్వల్పంగా గాయపడగా వారిని హాస్పిటల్ కు తరలించారు. రెండు కార్లు  దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై తమకు ఎలాంటి కంప్లయింట్ అందలేదని రాజేంద్రనగర్ ఇన్ స్పెక్టర్ నాగేంద్రబాబు తెలిపారు.