కలెక్టర్‌‌ సారూ... కనికరించండి ..రెండు కాళ్లు లేవు.. పెన్షన్ ఇవ్వండి

కలెక్టర్‌‌ సారూ... కనికరించండి ..రెండు కాళ్లు లేవు.. పెన్షన్ ఇవ్వండి
  • చాలాసార్లు దరఖాస్తు పెట్టుకున్నా.. అయినా మంజూరు కాలేదు
  • మంచిర్యాల గ్రీవెన్స్‌‌లో కలెక్టర్‌‌కు మొరపెట్టుకున్న దివ్యాంగుడు

మంచిర్యాల, వెలుగు : ‘కలెక్టర్‌‌ సారూ.. 18 నెలల కింద జరిగిన యాక్సిడెంట్‌‌లో నా రెండు కాళ్లు పోయాయి, సంవత్సరం కింద సదరం సర్టిఫికెట్‌‌ వచ్చింది... దివ్యాంగుల పెన్షన్‌‌ కోసం ఎన్ని సార్లు అప్లై చేసినా ఎవరూ పట్టించుకుంటలేరు.. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది.. మీరైనా కనికరించి పెన్షన్‌‌ మంజూరు చేయండి’ అని ఓ బాధితుడు సోమవారం మంచిర్యాల కలెక్టరేట్‌‌లో జరిగిన గ్రీవెన్స్‌‌లో మొరపెట్టుకున్నాడు.

 వివరాల్లోకి వెళ్తే... మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్‌‌పల్లికి చెందిన బొర్లకుంట శ్రీనివాస్‌‌కు భార్య సుమలత, కూతురు సృజన, కొడుకు శశాంక్‌‌ ఉన్నారు. శ్రీనివాస్‌‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. 2023 డిసెంబర్‌‌లో బెల్లంపల్లి కన్నాలబస్తీలో రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో హాస్పిటల్‌‌లో చేర్పించగా రెండు కాళ్లు తొలగించారు. 2024 జూలైలో సదరం సర్టిఫికెట్‌‌ రావడంతో దివ్యాంగుల పింఛన్‌‌ కోసం అప్లై చేసుకున్నాడు. అయినా ఇప్పటివరకు మంజూరు కాలేదు. 

దీంతో సోమవారం కలెక్టరేట్‌‌లో జరిగిన గ్రీవెన్స్‌‌కు హాజరై కలెక్టర్‌‌కు వినతిపత్రం ఇచ్చాడు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌‌ మాట్లాడుతూ యాక్సిడెంట్‌‌ టైంలో వచ్చిన ఇన్సూరెన్స్‌‌ డబ్బులు హాస్పిటల్‌‌ ఖర్చులకే సరిపోయాయని, ప్రస్తుతం కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పెన్షన్‌‌ కోసం అప్లై చేసుకున్నా ఎవరూ స్పందించడం లేదని, డబ్బులు అడుగుతున్నారని వాపోయాడు. తనకు దివ్యాంగుల పెన్షన్‌‌ మంజూరు చేయాలని కలెక్టర్‌‌ను కోరారు.