
దేశంపై పట్టు కోసం సైన్యం, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్(RSF) మధ్య కొనసాగుతున్న పోరుతో మరోసారి సూడాన్ రక్తసిక్తంగా మారింది. ఆదివారం (సెప్టెంబర్ 10న) సూడాన్ రాజధాని ఖార్టూమ్లోని మార్కెట్లో డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది చనిపోయారు. దాదాపు 36 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. గాయపడిన వారిని సూడాన్లోని బషీర్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు.
మయో ప్రాంతంలో పెద్దఎత్తున పారామిలిటరీ బలగాలు మోహరించి ఉన్నట్లు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి. ఈ దాడికి సైన్యానికి చెందిన వైమానిక దళమే కారణమని ఆర్ఎస్ఎఫ్ ఆరోపించింది.
ఏప్రిల్ 15న సూడాన్లో ప్రారంభమైన అంతర్యుద్ధం తర్వాత పౌరుల మరణాల సంఖ్య ఇదే అత్యధికం. ప్రస్తుతం నివాస ప్రాంతాలపై దాడి పరిధి పెరుగుతోంది. ఇక్కడ అధికారం కోసం సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య ఏప్రిల్ నుంచి పోరాటం సాగుతోంది.
ఆగస్టు నాటి యూఎన్ గణాంకాల ప్రకారం సైన్యం, పారామిలిటరీ దళం మధ్య జరిగిన ఘర్షణల్లో నాలుగువేల మందికి పైగా మరణించారు. అంతర్యుద్ధం కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. హింస కారణంగా దాదాపు 71 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టారు. 11 లక్షల మంది ప్రజలు విదేశాల్లో ఆశ్రయం పొందగా, లక్షలాది మంది దేశంలోనే ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు.